కేంద్రంలో బీజేపీని గద్దె దించాలి: స్టాలిన్
న్యూఢిల్లీ, ఏప్రిల్ 2: కేంద్రంలోని బీజేపీ సర్కారును గద్దె దించేందుకు కాంగ్రెస్, వామపక్షాలు, ప్రాంతీయ పార్టీలు ఏకతాటిపైకి రావాలని తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ తమ వ్యక్తిగత రాజకీయ ఆలోచలను పక్కనపెట్టి దేశాన్ని కాపాడుకునేందుకు ముందుకు రావాలని అన్నారు. ఢిల్లీ పర్యటనకు వెళ్లిన స్టాలిన్ శుక్రవారం ఓ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తమిళనాడులో తమ పార్టీతో ఉన్నట్టుగా దేశ స్థాయిలో కూడా ఇతర పార్టీలతో సూత్రప్రాయమైన స్నేహాన్ని పెంపొందించుకోవాలని కాంగ్రెస్ను కోరారు. దేశ సమాఖ్య వ్యవస్థ, ప్రజాస్వామ్యం, లౌకికవాదం, వైవిధ్యం, సమానత్వం, రాష్ర్టాల హక్కులను కాపాడుకోవాలంటే ప్రతిపక్షాలు ఐక్యంగా ఉండాల్సిన అవసరం ఉన్నదని అభిప్రాయపడ్డారు.