న్యూఢిల్లీ: ప్రతిపక్షాలకు చెందిన 12 మంది ఎంపీలను రాజ్యసభ నుంచి సస్పెండ్ చేయడం ప్రజాస్వామ్య వ్యతిరేక చర్య అని కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే విమర్శించారు. ప్రతిపక్షాల ఎంపీల్లో భయం పుట్టించేందుకు ఈ నిరంకుశ ప్రభుత్వం ఇలా చేసిందని ఆరోపించారు. 12 మంది ఎంపీలపై చర్య కోసం తీర్మానం చేయడం పూర్తిగా చట్టవిరుద్ధం, తప్పుడు విధామని, నిబంధనలకు వ్యతిరేకమని మండిపడ్డారు. గత సెషన్లో జరిగిన సంఘటనపై ఆ సెషన్లోనే చర్య తీసుకోవాలని, ప్రస్తుత సెషన్లో వారిని సస్పెండ్ చేయడం సరికాదన్నారు.
ఇతరుల కోసం గొంతులు వినిపించే వారి గొంతులను అణచివేస్తే అది ప్రజాస్వామ్యాన్ని ఉక్కిరిబిక్కిరి చేసినట్లేనని ఖర్గే విమర్శించారు. కాంగ్రెస్తోపాటు అన్ని పార్టీలు దీనిని ఖండిస్తున్నాయని అన్నారు. భవిష్యత్ కార్యాచరణ గురించి చర్చించడానికి ప్రతిపక్ష పార్టీల నేతలు మంగళవారం సమావేశమవుతున్నట్లు ఆయన చెప్పారు.