న్యూఢిల్లీ, మార్చి 28: లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు భావిస్తున్నాయి. సోమవారం సభ ముందుకు ఈ తీర్మానం వచ్చే అవకాశం ఉన్నట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తున్నది. కాంగ్రెస్ ఎంపీల సమావేశంలో స్పీకర్పై అవిశ్వాస తీర్మానం పెట్టాలనే ప్రతిపాదన వచ్చింది. దీంతో అన్ని ప్రతిపక్షాలతో కాంగ్రెస్ సంప్రదింపులు జరుపుతున్నది. ఇప్పటికే అదానీ అక్రమాలపై జేపీసీ వేయాలని, రాహుల్ గాంధీపై అనర్హత వేటుకు నిరసనగా ప్రతిపక్ష పార్టీలు పార్లమెంటులో కలిసి నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో స్పీకర్పై అవిశ్వాస తీర్మానంపై ఆయా పార్టీలు ఎలా వ్యవహరిస్తాయనేది చూడాల్సి ఉంది.