హైదరాబాద్, ఫిబ్రవరి 9 (నమస్తే తెలంగాణ): అదానీ-హిండెన్బర్గ్ వ్యవహారంపై నిజాలు నిగ్గు తేల్చేందుకు సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) వేయాలని, లేదా సుప్రీంకోర్టు న్యాయమూర్తితో విచారణ చేపట్టాలని బీఆర్ఎస్ సహా విపక్షాలన్నీ పార్లమెంట్ వేదికగా 6వ రోజైన గురువారం తమ ఆందోళనను కొనసాగించాయి. ప్రధాని మోదీని రాజ్యసభలో ముప్పు తిప్పలు పెట్టాయి. బీఆర్ఎస్ ఎంపీల నినాదాలతో పార్లమెంట్ హోరెత్తింది. అదానీ వ్యవహారంపై కేంద్రం తన చిత్తశుద్ధిని చాటుకోవాలని బీఆర్ఎస్ డిమాండ్ చేసింది. కేంద్రం వైఖరికి నిరసనగా ఉభయ సభలను బహిషరించిన అనంతరం బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే. కేశవరావు, లోక్సభాపక్ష నేత నామా నాగేశ్వర్రావు నాయకత్వంలో ఎంపీలు కే.ఆర్.సురేష్ రెడ్డి, దీవకొండ దామోదర్రావు, బడుగుల లింగయ్య యాదవ్, వద్దిరాజు రవిచంద్ర, కొత్త ప్రభాకర్ రెడ్డి, వెంకటేశ్ నేత, బీబీ పాటిల్, మాలోత్ కవిత, పసునూరి దయాకర్, పోతుగంటి రాములు, మన్నె శ్రీనివాస్రెడ్డి పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం ముందు నిరసన చేపట్టారు. బీఆర్ఎస్ ఎంపీలు చేస్తున్న నిరసనకు ఆమ్ ఆద్మీ పార్టీ సహా ఇతర విపక్ష ఎంపీలు గొంతు కలిపారు.
బీఆర్ఎస్ లోక్సభాపక్ష నేత నామా నాగేశ్వరరావు మాట్లాడుతూ అదానీ వ్యవహారంపై జేపీసీ దర్యాప్తు చేపట్టి, వాస్తవాలను ప్రజల ముందు పెట్టాలన్నారు. ఆరు రోజులుగా బీఆర్ఎస్ ఎంపీలు దేశ ప్రజలకు సంబంధించిన కీలక అంశంపై చర్చ జరపాలని కోరుతున్నా కేంద్రం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవహరిస్తుందని ఆయన మండిపడ్డారు. అదానీ వ్యవహారంలో కేంద్రం భయపడుతున్నదని, అందుకే చర్చ పెట్టడం లేదని ఆయన ఆరోపించారు. కేంద్రం ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి, పార్లమెంట్ ఉభయ సభల్లో అదానీ అంశాన్ని చర్చించి, ప్రజల్లోని అనుమానాలను నివృత్తి చేయాలని డిమాండ్ చేశారు. ఇంకా కేంద్రం ఇదే మొండి వైఖరి అనుసరిస్తే ప్రజలు సహించరన్నారు. కేంద్రం దిగివచ్చే దాకా తమ పోరాటం కొనసాగుతుందని తేల్చి చెప్పారు.
గురువారం రాజ్యసభలో ధన్యవాద తీర్మానానికి బదులిస్తూ ప్రధాని మోదీ ప్రసంగం చేసే సమయంలో ప్రతిపక్షాలు ఆయనను ముప్పు తిప్పలు పెట్టాయి. ‘మోదీ-అదానీ భాయి భాయి’ అంటూ విపక్ష ఎంపీలు నినాదాలు చేస్తూ వెల్లోకి దూసుకు వచ్చారు. ‘మాకు జేపీసీ కావాలి’ అని నినదించారు. దీనికి ప్రధాని స్పందిస్తూ ‘మీరు ఎంత బురద జల్లితే అంతగా కమలం వికసిస్తుంది’ అంటూ బదులిచ్చారు. తాను దేశం కోసమే జీవిస్తున్నానని, తనను ఎదుర్కొనే ధైర్యం లేక తన రాజకీయ ప్రత్యర్థులు కపట నాటకాలు ఆడుతున్నారని అన్నారు. అయితే విపక్షాలపై ప్రతివిమర్శలకే పరిమితమైన ప్రధాని మోదీ.. అదానీపై సంధించిన ప్రశ్నలకు మాత్రం బదులివ్వలేదు.