న్యూఢిల్లీ : ప్రజలపై పన్ను భారాలు మోపుతూ తాజా జీఎస్టీ రేట్లు సోమవారం నుంచి అమల్లోకి రావడంతో మోదీ సర్కార్పై విపక్ష నేతలు భగ్గుమంటున్నారు. ఓవైపు అధిక పన్నులతో నడ్డివిరుస్తూ మరోవైపు నిత్యావసరాలపై కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ రేట్లను పెంచిందని ఢిల్లీ సీఎం, ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ విమర్శలు గుప్పించారు. పెరిగిన జీఎస్టీ రేట్లను తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిత్యం వాడే ఆహారోత్పత్తులు, నిత్యావసరాలపై పన్ను భారం తగదని మండిపడ్డారు. పెరుగుతున్న ధరల నుంచి పలు సంక్షేమ కార్యక్రమాలతో ఢిల్లీ ప్రభుత్వం ప్రజలను ఆదుకుంటోందని అన్నారు.
గతంలో ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్ధిక వ్యవస్ధల్లో ఒకటిగా నిలిచిన మన ఆర్ధిక వ్యవస్ధను ధ్వంసం చేయడంలో బీజేపీ ఆరితేరిందని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఎద్దేవా చేశారు. ఉపాధి అవకాశాలు కల్పించని ప్రభుత్వం అదిక పన్నుల వడ్డనలో ముందుంటోందని వ్యాఖ్యానించారు. కాగా, నూతన జీఎస్టీ రేట్లు సోమవారం నుంచి అమల్లోకి రావడంతో పలు ఆహారోత్పత్తులు, వస్తువులు, సేవల ధరలు భారమయ్యాయి.
ప్రీ ప్యాక్డ్, ప్యాకేజ్డ్ ఆహోరోత్పత్తులపై కస్టమర్లు అధిక మొత్తం చెల్లించాల్సి రాగా నిర్ధిష్ట వస్తువులు, ఉత్పత్తులపై జీఎస్టీ రేట్లు పెరగడంతో నిత్యావసరాల ధరలూ భగ్గుమంటున్నాయి. హోటల్ రూంలు, బ్యాంక్ సేవలు భారమయ్యాయి. ఇక బియ్యం, గోధుమలు, పెరుగు, మజ్జిగ, లస్సీ, పన్నీర్, బెల్లం, తేనె, సోలార్ వాటర్ హీటర్లపై 5 శాతం నుంచి 18 శాతం జీఎస్టీ పరిధిలోకి తీసుకువచ్చారు. ఇక ఎలక్ట్రానిక్ వాహనాలపై జీఎస్టీ రేటు 5 శాతం తగ్గడం ఒక్కటే కొంత ఊరట కలిగిస్తోంది. ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రతినిధులతో కూడిన జీఎస్టీ కౌన్సిల్లో నిర్ణయాలకు అనుగుణంగా తాజా జీఎస్టీ రేట్లు నేటి నుంచి అమల్లోకి వచ్చాయి.