న్యూఢిల్లీ, ఏప్రిల్ 3: పార్లమెంట్లో ప్రతిపక్ష ఎంపీల ఆందోళనలు కొనసాగుతున్నాయి. అదానీ వ్యవహారంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాలని డిమాండ్ చేస్తూ సభ్యుల ఆందోళనతో సోమవారం కూడా ఉభయసభలు అట్టుడుకాయి. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా విపక్ష ఎంపీలు నినాదాలు చేశారు. అదానీ గ్రూపు వ్యాపార అక్రమాలపై హిండెన్బర్గ్ నివేదికపై జేపీసీ వేసి వాస్తవాలు నిగ్గుతేల్చాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంపై ప్రధాని మోదీ దేశ ప్రజలకు సమాధానం చెపాల్సిందేనని స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా కొంతమంది విపక్ష ఎంపీలు ‘మోదీ, అదానీ భాయ్ భాయ్’ అని రాసివున్న ప్లకార్డులు ప్రదర్శించారు. రాహుల్పై అనర్హత వేటును నిరసిస్తూ కాంగ్రెస్ పాటు పలు పార్టీల ఎంపీలు నల్ల అంగీలు ధరించారు. ఎంపీల ఆందోళనలతో లోక్సభ, రాజ్యసభలు వాయిదా పడ్డాయి. మంగళవారం మహవీర్ జయంతి నేపథ్యంలో ఉభయ సభలు తిరిగి బుధవారం సమావేశం కానున్నాయి. కాగా, ఇటీవల మరణించిన పుణె ఎంపీ గిరీశ్ బాపట్తో పాటు మాజీ ఎంపీకి లోక్సభ నివాళులు అర్పించింది. ఇటు రాజ్యసభలో కేంద్ర ప్రభుత్వం కాంపిటీషన్(సవరణ) బిల్లు-2023ను ప్రతిపక్ష ఎంపీల ఆందోళనల నడుమే ఆమోదింపజేసుకొన్నది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన ఈ బిల్లుకు ఎలాంటి చర్చ చేపట్టకుండా మూజవాణి ఓటుతో ఆమోదం తెలిపారు.