న్యూఢిల్లీ : రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం మరింత తీవ్రరూపం దాలుస్తున్నది. ఓ వైపు చర్చలు ప్రక్రియ కొనసాగుతుండగానే.. మరో వైపు రెండుదేశాల మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. ఈ క్రమంలో ఉక్రెయిన్లో భారతీయులకు ముప్పు పెరుగుతున్నది. ఈ క్రమంలో వాయుసేన రంగంలోకి దిగుతున్నది. సీ-17 విమానాల ద్వారా భారతీయులను తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నది. ప్రస్తుతం ఆపరేషన్ గంగా కొనసాగుతున్నది. ఆపరేషన్ను మరింత వేగవంతం చేసేందుకు ప్రధాని మోదీ స్వయంగా భారత వైమానిక దళం సహాయాన్ని కోరారు.
అదే సమయంలో భారతీయులకు తరలింపు వేగవంతం కానుండగా.. అలాగే భారత్ నుంచి పంపుతున్న సహాయ సామగ్రి సైతం పెరుగనున్నది. ఇవాళ్టి ఆపరేషన్ గంగా కింద పెద్ద ఎత్తున సీ-17 విమానాలను వినియోగించనున్నట్లు తెలుస్తున్నది. భారతీయ పౌరులను సురక్షితంగా సొంత ప్రాంతాలకు తరలించే వరకు విశ్రమించబోమని విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్ ట్వీట్ చేశారు. మరో వైపు ఉక్రెయిన్ నుంచి 182 మంది భారతీయులతో ఏడో విమానం బుకారెస్ట్ నుంచి ముంబైకి చేరింది. వారికి విమానాశ్రయంలో కేంద్రమంత్రి నారాయణ్ రాణే స్వాగతం పలికారు. అలాగే ఆపరేషన్లో భాగంగా ఎనిమిదో విమానం బుడాపెస్ట్ నుంచి ఢిల్లీకి బయలుదేరింది.