లక్నో: కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో తాను సమావేశమైనట్లుగా జరుగుతున్న ప్రచారాన్ని ఉత్తరప్రదేశ్కు చెందిన సుహెల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీ (ఎస్బీఎస్పీ) అధ్యక్షుడు ఓం ప్రకాష్ రాజ్భర్ ఖండించారు. అవి నిరాధార కథనాలని అన్నారు. తాను ఢిల్లీకి వెళ్లలేదని, అలాగే ఎవరినీ కూడా కలవలేదని తెలిపారు. స్థానిక ఎన్నికలపై తాను బిజీగా ఉన్నానని, సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) కూటమి అభ్యర్థుల విజయానికి కృషి చేస్తున్నానని చెప్పారు. అమిత్ షాతో భేటీ అయినట్లుగా సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న ఫొటోలు పాతవని తెలిపారు. ఎవరైనా వాటిని తిరిగి పోస్ట్ చేసి ఏమైనా వ్యాఖ్యలు చేయవచ్చన్నారు.
కాగా, సుహెల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీ (ఎస్బీఎస్పీ) 2019 ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలప్పుడు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేలో భాగస్వామ్య పార్టీగా ఉన్నది. అయితే 2022 అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) కూటమిలో చేరింది. 19 స్థానాల్లో పోటీ చేసిన ఆ పార్టీ ఆరు స్థానాల్లో విజయం సాధించింది.
అయితే ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆశించిన మేరకు ఎస్పీ రాణించకపోవడంతో తిరిగి ఎన్డీయేలో చేరేందుకు ఎస్బీఎస్పీ అధ్యక్షుడు ఓం ప్రకాష్ రాజ్భర్ ప్రయత్నిస్తున్నట్లు ప్రచారం జరుగుతున్నది. ఈ నేపథ్యంలో ఆయన ఇటీవల అమిత్ షాను కలిశారంటూ ఫొటోలతో కూడిన వార్తా కథనం సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నది.
దీంతో రాజ్భర్ దీనిపై శనివారం స్పందించారు. తాను అమిత్ షాతో భేటీ కాలేదని తెలిపారు. అది నిరాధార కథనమని అన్నారు. అమిత్ షాతో తాను కలిసి ఉన్న ఫొటో కూడా పాతదని గుర్తు చేశారు.