శ్రీనగర్ : దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన కరోనా కొత్త ఒమిక్రాన్ వేరియంట్ కేసులు భారత్లోనూ నమోదయ్యాయి. ఇప్పటి వరకు ఐదు కేసులు నమోదైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో జమ్మూకశ్మీర్లోని శ్రీమాతా వైష్ణోదేవి దేవస్థానం బోర్డు కీలక నిర్ణయం తీసుకున్నారు. అమ్మవారి దర్శనానికి వచ్చే వారంతా 72 గంటల ముందు తీసుకున్న కొవిడ్ నెగెటివ్ రిపోర్ట్ లేదంటే రెండు డోసులు టీకా తీసుకున్నట్లుగా సర్టిఫికెట్ చూపించాల్సిందేనని దేవస్థానం బోర్డు సీఈవో రమేశ్కుమార్ స్పష్టం చేశారు. అయితే నెగెటివ్ సర్టిఫికెట్ లేకుండా వచ్చిన వారికి స్థానికంగానే పరీక్షలు చేయించనున్నట్లు పేర్కొన్నారు.
రిపోర్ట్ ఆధారంగానే ఆలయ ప్రవేశానికి అనుమతి ఉంటుందని చెప్పారు. అలాగే భక్తులంతా తప్పనిసరిగా కొవిడ్ నిబంధనలు పాటించాలని కోరారు. అయితే, ఇప్పటికే ఆలయంలో మాస్క్లు తప్పనిసరి చేయడంతో పాటు భౌతిక దూరం పాటించడం తప్పనిసరి చేశారు. కొవిడ్ నేపథ్యంలో భక్తులను అనుసరించాల్సిన ముందు జాగ్రత్త చర్యలపై అవగాహన కల్పిస్తున్నారు. ఇదిలా ఉండగా.. వైష్ణోదేవి దర్శనం కోసం వచ్చిన 61 మంది ప్రయాణికులకు కరోనా పాజిటివ్గా తేలింది. దీంతో అధికారులు వారిని వెనక్కి పంపారు.