చెన్నై: హిందువులు, బౌద్ధులు, సిక్కు మతస్థులకు మాత్రమే ఎస్సీ కోటా వర్తిస్తుందని ఇటీవల సుప్రీంకోర్టు ఓ తీర్పు సందర్భంగా క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇవాళ మద్రాసు హైకోర్టులో ఓ పిల్ దాఖలైంది. తమిళనాడులో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎస్సీ రిజర్వేషన్ స్థానాల్లో కేవలం ఆ మూడు మతస్థుల వారికే పోటీపడే ఛాన్సు ఇవ్వాలని పిల్లో కోరారు. తమిళనాడులో మొత్తం 44 ఎస్సీ రిజర్వ్డ్ స్థానాలు ఉన్నాయి. అయితే అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్న సమయంలో రిటర్నింగ్ ఆఫీసర్లు.. ఆ ఎస్సీ కోటా అభ్యర్థులు ఏ మతానికి చెందినవారో స్పష్టంగా తెలుసుకోవాలని పిల్లో కోరారు. ఈ నేపథ్యంలో తమిళనాడు ఎన్నికల అధికారికి ఆదేశాలు ఇవ్వాలని మద్రాసు హైకోర్టును పిల్లో కోరారు. కేవలం హిందు, సిక్కు, బౌద్ద మతంలో ఉన్న ఎస్సీలకు మాత్రం కేటగిరీ కోటా సీట్లు ఇవ్వాలని, ఇతర మతాల్లోని ఎస్సీలను తిరస్కరించాలని పిల్లో పేర్కొన్నారు. ఇరు మక్కల్ కచ్చి వ్యవస్థాపక అధ్యక్షుడు అర్జునన్ సంపత్ పిల్ను దాఖలు చేశారు.