PMKVY | (స్పెషల్ టాస్క్ బ్యూరో ) హైదరాబాద్, మార్చి 19(నమస్తే తెలంగాణ): కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఏడేండ్ల కిందట ఆర్భాటంగా ప్రారంభించిన ప్రధాన మంత్రి కౌశల్ వికాస్ యోజన(పీఎంకేవీవై) స్కీమ్ ఆరంభ శూరత్వంగా మారిపోయింది. ఈ పథకం ద్వారా కోట్లాది మంది యువతకు శిక్షణ ఇచ్చి, వారిని ఉపాధి వైపు నడిస్తామన్న సర్కార్ ప్రకటనలు.. ఉత్తి మాటలుగానే మిగిలిపోయాయి. ఇప్పటి వరకు ఈ నైపుణ్యాభివృద్ధి స్కీమ్ కింద శిక్షణ పొందిన ప్రతి నలుగురిలో ఒకరు మాత్రమే ఉపాధి పొందారు. ఈ ఏడాది మార్చి 14 వరకు ఉన్న అధికారిక లెక్కల ప్రకారం శిక్షణ పొందిన వారిలో 22.2 శాతం మంది యువత మాత్రమే ఉద్యోగాలకు ఎంపికయ్యారు. మిగతా వారు ఇంకా ఉపాధి వేటలోనే ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం 2015 నుంచి దేశవ్యాప్తంగా పీఎంకేవీవై స్కీమ్ను నడిపిస్తున్నది.
ఇప్పటికి 3 దఫాలుగా 300లకు పైగా కోర్సులతో యువతకు శిక్షణ కార్యక్రమాలను నిర్వహించింది. శిక్షణ అనంతరం ఉపాధి విషయంలో సక్సెస్ రేటు తక్కువగా ఉన్నప్పటికీ.. ఇటీవల కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మాత్రం త్వరలో నాలుగో దఫా శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్టు పార్లమెంట్లో ప్రకటించారు. యువతకు నాణ్యమైన శిక్షణ ఇచ్చి, ఉపాధి కల్పించడం ద్వారా.. పీఎంకేవీవై కోసం ఖర్చు చేస్తున్న కోట్లాది రూపాయలు నిరుపయోగం కాకుండా చూడాలని ప్రతిపక్ష నేతలు, సామాజిక కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చి గద్దెనెక్కిన బీజేపీ.. ఆ తర్వాత నిరుద్యోగులను మోసం చేసిందని విపక్ష పార్టీలు, యువజన సంఘాలు ఇప్పటికే విమర్శలు చేస్తున్నాయి.