న్యూఢిల్లీ, డిసెంబర్ 16: దేశంలో వివిధ ఎడ్టెక్ కంపెనీలు, కాలేజీలు విదేశీ వర్సిటీలతో ఒప్పందాలు కుదుర్చుకొని ఆఫర్ చేస్తున్న ఆన్లైన్ డిగ్రీ కోర్సులకు గుర్తింపు లేదని యూజీసీ వెల్లడించింది. ఈ తరహా కోర్సుల్లో చేరవద్దని విద్యార్థులకు శనివారం హెచ్చరిక జారీ చేసింది. కాలేజీలు, ఎడ్టెక్ కంపెనీలు విదేశీ వర్సిటీలతో కుదుర్చుకున్న ఒప్పందాలకు యూజీసీ నుంచి అనుమతి, గుర్తింపు లేదని, నిబంధనల ఉల్లంఘనకు పాల్పడితే తగిన చర్యలుంటాయని స్పష్టం చేసింది.
‘దేశీయంగా పలు ఎడ్టెక్ కంపెనీలు, కాలేజీలు ఆన్లైన్లో వివిధ కోర్సులు, డిగ్రీలను ఆఫర్ చేస్తున్న సంగతి మా దృష్టికి వచ్చింది. దిన పత్రికలు, సోషల్మీడియా, టీవీల్లో ప్రకటనలు జారీ చేస్తున్నాయి. ఆన్లైన్ విధానంలో ఆఫర్ చేస్తున్న డిగ్రీ, డిప్లొమా కోర్సులకు యూజీసీ గుర్తింపు లేదు’ అని యూజీసీ సెక్రెటరీ మనీశ్ జోషి చెప్పారు.