అనంత్నాగ్, సెప్టెంబర్ 15: జమ్ముకశ్మీర్లోని అనంత్నాగ్ జిల్లాలో భద్రతా బలగాలు చేపట్టిన ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్ శుక్రవారంతో మూడో రోజుకు చేరుకొన్నది. ఉగ్రవాదుల కోసం బలగాలు సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి. గాలింపు చర్యల కోసం డ్రోన్లను వినియోగిస్తున్నారు. బుధవారం చోటుచేసుకొన్న ఎన్కౌంటర్ సందర్భంగా ఉగ్రవాదుల ఎదురుకాల్పుల్లో మరణించిన వారి సంఖ్య నాలుగుకు చేరింది. కాల్పుల్లో తీవ్ర గాయాలపాలైన జవాన్ ఒకరు శుక్రవారం మరణించారు. ఇప్పటికే ఈ ఉగ్రఘాతుకంలో ఇద్దరు ఆర్మీ అధికారులు, ఓ సీనియర్ పోలీసు అధికారి మరణించిన విషయం తెలిసిందే.
కర్నల్ మన్ప్రీత్ సింగ్, మేజర్ ఆశిష్ దోన్చక్ భౌతికకాయాలు శుక్రవారం ఉదయం వారి స్వస్థలాలకు చేరుకొన్నాయి. అంత్యక్రియల్లో కుటుంబసభ్యులతో పాటు వందలాదిగా స్థానికులు పాల్గొని ఘన నివాళులర్పించారు. కర్నల్ మన్ప్రీత్ సింగ్ ఆరేండ్ల కుమారుడు సైనికుడి దుస్తుల్లో తన తండ్రి భౌతికకాయానికి వీడ్కోలు పలుకుతూ సెల్యూట్ చేశారు. ఈ దృశ్యాన్ని చూసిన ప్రతి మనసు బరువెక్కింది. మరోవైపు జమ్ముకశ్మీర్లోని బారాముల్లా జిల్లాలో లష్కరే తాయిబాకు చెందిన ఇద్దరు ఉగ్రవాదులను అరెస్టు చేసినట్టు పోలీసులు శుక్రవారం వెల్లడించారు.