జమ్ము, జూన్ 3: కశ్మీర్కు తిరిగి వస్తే రక్షణ కల్పిస్తామంటూ అబద్ధపు హామీలు ఇచ్చారు. మోదీ సర్కారు చెప్పిన ఆ మాటలు నమ్మి పిల్లా, పాపలతో ఎక్కడెక్కడికో వెళ్లిన కశ్మీరీ పండిట్లు, హిందువులు మళ్లీ లోయకు చేరుకొన్నారు. అయితే, ఉగ్రమూకలు మళ్లీ పేట్రేగిపోయాయి. సగటున రోజుకు ఒకరి చొప్పున ఊచకోతకు పాల్పడుతున్నాయి. దీంతో పండిట్లు, ఉద్యోగులు రోజులు లెక్కబెట్టుకొంటూ దినదిన గండంగా బతుకీడుస్తున్నారు. ‘మిమ్మల్ని నమ్మి లోయకు వచ్చాం. రక్షించండి. మమ్మల్ని సురక్షిత ప్రాంతాలకు బదిలీ చేయండి’ అంటూ కేంద్రప్రభుత్వానికి పండిట్, హిందూ ఉద్యోగులు కొన్ని వారాలుగా మొర పెట్టుకొంటున్నారు. అయితే బీజేపీ సర్కారు మీనమేషాలు లెక్కిస్తున్నది. అందుకే ప్రభుత్వ ఉదాసీన, నిర్లిప్త వైఖరిని ఎండగడుతూ ప్రతిపక్షాలతో పాటు స్వపక్ష నేతలు కూడా విరుచుకుపడుతున్నారు.
షాకు క్రీడాశాఖ బెటరేమో..
కశ్మీర్లో పండిట్, హిందువుల హత్యల నేపథ్యంలో కేంద్ర హోంశాఖ పదవికి అమిత్ షా రాజీనామా చేయాలని బీజేపీ సీనియర్ నేత సుబ్రమణ్యస్వామి డిమాండ్ చేశారు. అంతేకాదు.. షాకు హోంశాఖ కంటే క్రీడాశాఖ అప్పగిస్తే బాగుంటుందని ఎద్దేవా చేశారు. ‘జమ్ముకశ్మీర్ రాష్ట్రపతి పాలనలో ఉన్నది. అక్కడ ప్రతీరోజు ఓ కశ్మీరీ హిందువు హత్యకు గురవుతున్నారు. ఈ పరిస్థితుల్లో అమిత్ షా రాజీనామాకు డిమాండ్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఆయనకు క్రీడల శాఖ అప్పగిస్తే బాగుంటుంది. ఎందుకంటే ఈ రోజుల్లో క్రికెట్కు అనవసర ఆదరణ చాలా పెరిగింది’ అని ట్విట్టర్లో విమర్శించారు. జమ్ముకశ్మీర్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులకు బాధ్యత వహిస్తూ ప్రధాని మోదీ, కేంద్రమంత్రి అమిత్ షా పదవులకు రాజీనామా చేయాలని ఆమ్ఆద్మీపార్టీ సీనియర్ నాయకుడు హర్ష్దేవ్ డిమాండ్ చేశారు. కశ్మీర్లోని పండిట్లు, హిందువులకు తగిన భద్రత కల్పించాలని అమిత్ షాకు శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది విజ్ఞప్తి చేశారు. పండిట్ల వలసలను నిరోధిస్తూ.. కశ్మీర్లో ప్రశాంత వాతావరణాన్ని నెలకొల్పేందుకు ప్రభుత్వం వెంటనే తగిన చర్యలు చేపట్టాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది.
ఇప్పుడు మాత్రం నిశ్శబ్దమా?
ఆర్టికల్ 370 రద్దు తర్వాత కశ్మీర్లో సాధారణ పరిస్థితులు నెలకొంటాయని బీజేపీ నేతలు చెప్పారని, కానీ ఇప్పుడు పరిస్థితులు అందుకు పూర్తి భిన్నంగా ఉన్నాయని ఛత్తీస్గఢ్ సీఎం భూపేశ్ బఘేల్ అన్నారు. ‘కశ్మీర్ ఫైల్స్’ సినిమాను చూడటానికి వాళ్లకు సమయం ఉంటుందని, అయితే హిందువులు హత్యకు గురవుతుంటే బీజేపీ, ఆరెస్సెస్ నేతలు ఎందుకు నిశ్శబ్దాన్ని పాటిస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం జరుగుతున్న హత్యలకు ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు.
తిరిగి విధుల్లో చేరలేం
వరుస హత్యలతో భయభ్రాంతులకు గురైన కొందరు కశ్మీరీ పండిట్లు, స్కూల్, బ్యాంకు ఉద్యోగులు ఇప్పటికే లోయను విడిచిపెట్టి జమ్ములోని సురక్షిత ప్రాంతాలకు చేరుకొన్నారు. ఉగ్రవాదుల దాడులకు భయపడిపోయిన తమకు కేంద్రం ఎలాంటి భరోసా, భద్రతను కల్పించలేకపోయిందని మండిపడ్డారు. కనీసం లోయ నుంచి జమ్ము ప్రాంతాలకు తమను బదిలీ చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆల్ జమ్ము బేస్డ్ రిజర్వ్డ్ క్యాటగిరీస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఉద్యోగులు జమ్ములోని పనామా చౌక్ వద్ద శుక్రవారం నిరసన ప్రదర్శనలు చేపట్టారు. ‘లక్షిత హత్యలు జరుగుతున్న ఈ భయానక పరిస్థితుల్లో తిరిగి కశ్మీర్కు వెళ్లి విధుల్లో చేరలేం. మళ్లీ వెనక్కి వెళ్లడం కంటే ఇక్కడే ప్రాణాలు విడిచిపెట్టడం మేలు’ అని సురీందర్ కుమార్ అనే ఉద్యోగి అన్నారు. కశ్మీర్లో ఇప్పటికే 15 ఏండ్లు విధులు నిర్వహించామని, ప్రభుత్వం తమను జమ్ముకు బదిలీ చేయాలని డిమాండ్ చేశారు. కశ్మీర్లో సురక్షిత ప్రాంతాలు ఎక్కడున్నాయి? అని ఓ మహిళా ఉద్యోగి నిలదీసింది. మరోవైపు, బ్యాంక్ మేనేజర్ విజయ్ కుమార్ హత్యను ఆలిండియా బ్యాంక్ ఆఫీసర్స్ ఫెడరేషన్ ఖండించింది. కశ్మీర్లోని బ్యాంకు శాఖల వద్ద తగిన భద్రత కల్పించాలని డిమాండ్ చేసింది.
జోక్యం చేసుకోండి
పండిట్ల హత్యలపై జోక్యం చేసుకోవాలని కశ్మీర్ పండిట్ సంఘర్ష్ సమితి హైకోర్టుకు విజ్ఞప్తి చేసింది. కశ్మీర్ లోయ నుంచి మైనారిటీలను ఇతర సురక్షిత ప్రాంతాలకు బదిలీ చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరింది. పండిట్లు, హిందూ ఉద్యోగుల లక్షిత దాడుల నేపథ్యంలో జమ్ముకశ్మీర్లో పరిస్థితులపై కేంద్రహోంమంత్రి అమిత్ షా శుక్రవారం సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ భేటీలో జాతీయ భద్రతా సలహాదారు (ఎన్ఎస్ఏ) అజిత్ దోవల్, ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే, జమ్ముకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా పాల్గొన్నారు.