ONGC | కృష్ణా గోదావరి బేసిన్లో ముడి చమురు ఉత్పత్తిని ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ONGC) ప్రారంభించింది. ఈ విషయాన్ని పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ వెల్లడించారు. బంగాళాఖాతంలో కృష్ణా నది పరీవాహక ప్రాంతంలో కేజీ డీ డబ్ల్యూఎస్ 98/2 బ్లాక్లో తొలిసారిగా ఆదివారం చమురు ఉత్పత్తి జరిగినట్లు కేంద్రమంత్రి ప్రకటించారు. బ్లాక్ నుంచి ప్రతిరోజూ 45వేల బ్యారెల్స్కు క్రూడాయిల్ను ఉత్పత్తి అవుతుందని భావిస్తున్నట్లు ఆయన తెలిపారు.
ఈ స్థాయిలో ఉత్పత్తికి చేరుకునేందుకు కొంత సమయంపడుతుందన్నారు. ఈ ప్రాజెక్టులో ప్రస్తుతం దేశం మొత్తం చమురు ఉత్పత్తిలో 7శాతం, న్యాచురల్ గ్యాస్ను ఉత్పత్తి చేసే అవకాశం ఉన్నది. ఓఎన్జీసీకి అనుబంధంగా మంగళూరు రిఫైనరీ అండ్ పెట్రో కెమికల్స్ లిమిటెడ్కు ముడి చమురును పంపనున్నారు. అక్కడ ముడి చమురు నాణ్యతను పరిశీలించి గ్రేడింగ్ నిర్ణయిస్తారు.
ప్రస్తుతం చమురువు వెలికి తీస్తున్న కృష్ణా గోదావరి బేసిన్ ప్రాజెక్టు బంగాళాఖాతం డెల్టా భాగం, ఆంధ్రప్రదేశ్ ప్రాదేశిక జలాలకు 35 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. ఈ ప్రాజెక్టును మూడు క్లస్టర్లుగా విభజించారు. ప్రస్తుతం క్లస్టర్-2లో చమురు ఉత్పత్తిని ప్రారంభించారు. కృష్ణా గోదావరి బేసిన్లో ముడి చమురు ఉత్పత్తి చేయడంపై ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. భారత్కు కీలకమైన ముందడుగు అని.. దేశ స్వావలంభన మిషన్కు ప్రోత్సాహాన్ని ఇస్తుందన్న ఆయన.. దేశ ఆర్థిక వ్యవస్థకు మేలు జరుగుతుందన్నారు.