ముంబై: దేశ ఆర్థిక రాజధాని ముంబైలో మీజిల్స్ (తట్టు) కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. మంగళవారం ఒక్కరోజే మహానగరంలో 20 మంది తట్టు (Measles ) బారినపడ్డారని బృహిన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC) తెలిపింది. ఈ వ్యాధి వల్ల ఏడాది వయస్సు ఉన్న చిన్నారి మరణించిందని వెల్లడించింది. దీంతో ఇప్పటివరకు ఈ ఏడాదిలో పది మంది తట్టు వల్ల ప్రాణాలు కోల్పోయారని చెప్పింది. జనవరి 1 నుంచి 220 కేసులు నమోదయ్యాయని పేర్కొన్నది.
ముంబైలో మీజిల్స్ వ్యాప్తి నేపథ్యంలో ప్రజలు తొమ్మిది నెలల నుంచి ఐదేండ్ల వయస్సు ఉన్న తమ చిన్నారులకు వెంటనే టీకాలు వేయించాలని బీఎంసీ కోరింది. కాగా, మీజిల్స్ చికిత్స కోసం అంధేరిలోని సెవెన్హిల్స్ దవాఖానలో ప్రత్యేక ఏర్పాట్లు చేశామని వెల్లడించింది.
దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు వెలువడే తుంపర్ల వల్ల ఒకరి నుంచి మరొకరికి మీజిల్స్ సోకుతుంది. ఒళ్లంత దద్దుర్లు, తీవ్రమైన జ్వరం దీని లక్షణాలు. విరేచనాలు, న్యుమోనియా కూడా కొందరిలో ఉంటుంది.. ఇవన్నీ కలిసి మరణానికి కారణమవుతాయి. రోగ నిరోధకత స్థాయి 95 శాతం కంటే తక్కువగా ఉన్న ఏ ప్రాంతంలోనైనా ఇది వ్యాపించే అవకాశం ఉంది. 1963లోనే తట్టుకు వ్యాక్సీన్ అందుబాటులోకి వచ్చింది. అయినప్పటికీ ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం లక్షా 40 వేల మంది ప్రాణాలను హరిస్తుండటం గమనార్హం.