శ్రీనగర్ : ద్రబ్గామ్ ప్రాంతంలో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఉగ్రవాదులకు సంబంధించిన సమాచారం అందడంతో ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి తనిఖీలు చేపట్టారు. దీంతో బలగాలను గమనించిన ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ క్రమంలో భద్రతా బలగాలు ఎదురుకాల్పులు జరుపగా.. ఓ ఉగ్రవాది మృతి చెందాడు. ప్రస్తుతం ఆపరేషన్ కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు.
ఇదిలా ఉండగా.. గడిచిన 24 గంటల్లో ఇది రెండో ఎన్కౌంటర్. ఇంతకు ముందు కుల్గామ్లోని ఖండిపొరాలో ఎన్కౌంటర్ జరగ్గా.. ఓ ఉగ్రవాది మృతి చెందాడు. శ్రీనగర్-బారాముల్లా హైవేపై ఉగ్రవాదుల భారీ కుట్రను భద్రతా బలగాలు భగ్నం చేశాయి. బారాముల్లా-శ్రీనగర్ జాతీయ రహదారిపై అమర్చిన ఐఈడీని బలగాలను నిర్వీర్యం చేశాయి. బలగాలే లక్ష్యంగా ఐఈడీని అమర్చినట్లు తెలుస్తున్నది.