PM Modi | (స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, ఏప్రిల్ 9 (నమస్తే తెలంగాణ): నేటి విద్యార్థులే రేపటి దేశ భవిష్యత్తు అంటారు. అయితే గత 27 ఏండ్లుగా బీజేపీ పాలిస్తున్న గుజరాత్లో సరిపడా ఉపాధ్యాయులు లేక పిల్లలకు సరైన విద్య అందక ప్రాథమిక విద్యా వ్యవస్థ కునారిల్లుతున్నది. బీజేపీ నేతలు చెప్పుకొనే డబుల్ ఇంజిన్ పాలనలో రాష్ట్రంలోని పాఠశాలలు దయనీయ పరిస్థితుల్లో మగ్గిపోతున్నాయి. 906 బడులు కేవలం ఒక్క ఉపాధ్యాయుడితో నడుస్తున్నాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. గుజరాత్లోని బడుల పరిస్థితిపై క్షేత్రస్థాయి పరిశీలన చేసిన హిందీ పత్రిక దైనిక్ భాస్కర్ పలు సంచలన విషయాలు వెల్లడించింది.
బడిలో ఉండే ఐదు తరగతుల పిల్లలకు ఒక్క టీచరే పాఠాలు చెప్పాల్సి రావడంతో పిల్లలకు పాఠాలు సరిగా బోధపడటం లేదు. దీంతో పేరుకు మూడో తరగతికి వచ్చినా కొంతమందికి అక్షరాలు రాయడం, చదవడం రాని పరిస్థితి ఉన్నది. బడుల్లో ఉపాధ్యాయుల కొరత నేపథ్యంలో టీచర్లకు స్థానిక గ్రామస్తులు సహకరిస్తున్నారు. చివరకు మధ్యాహ్న భోజన సిబ్బంది కూడా పాఠాలు బోధించాల్సి వస్తున్నది. ఈ నేపథ్యంలో బీజేపీ ప్రభుత్వ తీరుపై ప్రజలు మండిపడుతున్నారు. విద్యార్థుల భవితతో ఆటలాడుకోవద్దని, సరిపడా ఉపాధ్యాయులను నియమించాలని డిమాండ్ చేస్తున్నారు.
గుజరాత్లోని 33 జిల్లాల్లో వివిధ పాఠశాలల పరిస్థితులను పరిశీలించగా తేలిందేంటంటే 906 పాఠశాలల్లో 5 తరగతులకు గాను కేవలం ఒక్క టీచరే పనిచేస్తున్నారు. విద్యాశాఖ మంత్రి సొంత జిల్లాలో అయితే 102 పాఠశాలల్లో ఒకే ఉపాధ్యాయుడే ఉన్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వమే పేర్కొన్నది. అన్ని తరగతులకు చెందిన విద్యార్థులందరినీ ఒకే గదిలో కూర్చోబెట్టి పాఠాలు చెప్పడం వల్ల, వారికి పాఠాలు అర్థం కావటం లేదని ఉపాధ్యాయులే చెబుతున్నారు. మొత్తంగా ఉపాధ్యాయుల కొరతతో రాష్ట్రంలో ప్రాథమిక విద్య అస్తవ్యస్తంగా తయారైందన్న విమర్శలు వస్తున్నాయి.
నేను భండర్వాడ్ గ్రామ ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయినిగా పనిచేస్తున్నాను. పోస్టులన్నీ ఖాళీగా ఉండటంతో, అటెండరు నుంచి హెడ్మాస్టర్ వరకు అన్ని పనులు నేనే చేయాల్సి వస్తుంది. మధ్యాహ్న భోజన కుక్ నాకు సహకరిస్తుంది. వంటపని పూర్తయిన తరువాత.. తను కూడా కొన్ని తరగతులకు పాఠాలు చెబుతుంది.
– సీమా బెహన్, హెడ్మాస్టర్ భండర్వాడ్, ఉమర్గావ్ తాలూకా
ఎమ్మెల్యే మోహన్భాయ్ నియోజకవర్గం వలోద్లోని అంధాత్రి గ్రామంలో టీచర్ ఆరునెలల క్రితం రిటైర్ అయ్యారు. 47 మంది విద్యార్థులున్న పాఠశాలలో ఇప్పటివరకు మరో ఉపాధ్యాయుడిని నియమించలేదు. మధ్యాహ్న భోజన వంటమనిషే విద్యార్థులకు పాఠాలు చెబుతున్నారు.
– కమలా బెహన్, అంధాత్రి వాసి
హరిపుర గ్రామంలోని పాఠశాలలో నా కొడుకు మూడో తరగతి చదువుతున్నాడు. కనీసం మాతృభాష అయిన గుజరాతీ చదవడం, రాయడం కూడా రావటం లేదు.
– నీలేష్ భాయ్, హరిపుర గ్రామం, బోర్సాద్ తాలూకా