శ్రీనగర్: జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. శనివారం రాత్రి కుల్గాం జిల్లాలోని ఖైమోహ్ ప్రాంతంలో ఓ పోలీసు అధికారిపై ముష్కరులు గ్రనేడ్ దాడి (Grenade attack) చేశారు. దీంతో తీవ్రంగా గాయపడిన ఆయనను అనంత్నాగ్లోని ప్రభుత్వ దవాఖానకు తరలించారు. అయితే పరిస్థితి విషమించడంతో ఆదివారం తెల్లవారుజామున మృతిచెందాడని అధికారులు తెలిపారు. ఆయనను పూంచ్కు చెందిన తాహిర్ ఖాన్గా గుర్తించారు.
కాగా, రాజౌరీ జిల్లాలోని ఆర్మీ క్యాంప్పై ముష్కరులు ఆత్మాహుతి దాడికి పాల్పడిన మరుసటి రోజే ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. శుక్రవారం ఉదయం రాజౌరీలోని ఆర్మీ బేస్ క్యాంపుపై ఇద్దరు ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. సుమారు నాలుగు గంటలపాటు జరిగిన హోరాహోరీ కాల్పుల్లో నలుగు సైనికులు అమరులవగా, ఇద్దరు టెర్రిరిస్టులను భద్రతా బలగాలు కాల్చి చంపాయి.