One Nation-One Election | ఒకే దేశం-ఒకే ఎన్నిక ప్రతిపాదనలకు సంబంధించిన బిల్లులను పరిశీలించేందుకు ఏర్పాటు చేసిన జాయింట్ పార్లమెంటరీ కమిటీ (JPC) రెండో సమావేశం ఈ నెల 31న జరుగనున్నది. ఈ మేరకు లోక్సభ అధికారిక వెబ్సైట్లో సమావేశం వివరాలు పబ్లిష్ అయ్యాయి. రాజ్యాంగ (129వ సవరణ) బిల్లు, కేంద్ర పాలిత ప్రాంతాల చట్టాలు (సవరణ) బిల్లులను గత శీతాకాల సమావేశాల్లో లోక్సభ లో ప్రవేశపెట్టారు. బిల్లులను పరిశీలించాలని కమిటీకి సూచించారు. జేపీసీ తొలి సమావేశం ఈ నెల 8న జరిగిన విషయం తెలిసిందే. ఈ సమావేశంలో ప్రతిపాదిత చట్టాల నిబంధనలను కమిటీకి న్యాయ మంత్రిత్వశాఖ ప్రతినిధులు, అధికారులు వివరించారు.
సమావేశంలో ప్రతిపక్ష సభ్యులు చట్టాల సవరణను రాజ్యాంగం, సమాఖ్యవాదం ప్రాథమిక స్ఫూర్తిపై దాడిగా అభివర్ణించారు. కమిటీకి బీజేపీ ఎంపీ పీపీ చౌదరి నేతృత్వం వహిస్తున్నారు. 39 మంది సభ్యుల కమిటీలో కాంగ్రెస్కు చెందిన ప్రియాంక గాంధీ, జనతాదళ్ (యూ)కు చెందిన సంజయ్ ఝా, శివసేనకు చెందిన శ్రీకాంత్ షిండే, ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి సంజయ్ సింగ్, కల్యాణ్ బెనర్జీ, సాకేత్ గోఖలే (టీఎంసీ) ఉన్నారు. జమిలీ ఎన్నికలకు సంబంధించిన రెండు ముసాయిదా బిల్లులను పరిశీలించేందుకు రాజకీయ పార్టీలు సుముఖత వ్యక్తం చేయడంతో కమిటీ సభ్యుల సంఖ్యను కేంద్రం 39కి పెంచింది. కమిటీలో మాజీ కేంద్రమంత్రులు అనురాగ్ ఠాకూర్, పర్షోత్తమ్ రూపాలా, మనీష్ తివారీ, ఎంపీలు అనిల్ బలూని, బన్సూరి స్వరాజ్, సంబిత్ పాత్రా ఉన్నారు. కమిటీలో లోక్సభ నుంచి 27 మంది, రాజ్యసభ నుంచి 12 మంది సభ్యులు ఉన్నారు.