పూరీ : ఒడిశాలోని పూరీలో గురువారం జరిగిన జగన్నాథ రథయాత్రలో విషాదం చోటుచేసుకుంది. రథయాత్ర సందర్భంగా ఒక పక్క సన్నగా వర్షం పడుతుండగా బడా తండ (గ్రాండ్ రోడ్)లో జరిగిన తొక్కిసలాటలో ఒక భక్తుడు మరణించాడు. 100 మంది గాయపడ్డారు. కొంత మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఒక భక్తుడు ఊపిరాడక కింద పడిపోవడంతో అతడిని వెంటనే పూరీ జిల్లా ప్రధాన దవాఖానకు తరలించారు.
అయితే అతను అప్పటికే మరణించినట్టు వైద్యులు ప్రకటించారు. రథయాత్ర సందర్భంగా భక్తులు పోటెత్తడంతో సింహద్వారం వద్ద అస్వస్థతకు గురైన పలువురు భక్తులను నిర్వాహకులు స్ట్రెచర్ల ద్వారా తరలించి రక్షించారు. ఈ ఘటనలో అస్వస్థతకు గురైన 50 మందికి వివిధ దవాఖానలలో చికిత్స అందిస్తున్నారు. తొక్కిసలాట జరిగిన ప్రదేశంలో చెప్పులు, బ్యాగ్లు, ఇతర వస్తువులు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. తొక్కిసలాటకు గల కారణం తెలియరాలేదని అధికారులు చెప్పారు. ఒక పక్క ఆ ప్రాంతంలో వాన కురుస్తున్నా ఈ వేడుకకు సుమారు రెండు లక్షల మంది భక్తులు హాజరయ్యారు.