Pandits Protests | కశ్మీర్ పండిట్ల వలసలపై విచారణకు కమిషన్ ఏర్పాటు చేయాలన్న డిమాండ్తో కశ్మీర్ లోయ ఆదివారం ధర్నాలు, ఆందోళనలతో హోరెత్తింది.కశ్మీర్లోయలో ప్రధాని నరేంద్రమోదీ పర్యటిస్తున్న నేపథ్యంలో పండిట్లు ఆందోళనకు దిగడం ప్రాధాన్యం సంతరించుకున్నది. శ్రీనగర్లో కశ్మీరీ పండిట్ వాలంటీర్స్ (కేవీపీ) నేత సందీప్ మావా నిరవధిక నిరాహార దీక్ష చేపట్టారు. కొద్ది రోజుల్లో తమ డిమాండ్లు నెరవేరకపోతే ఆత్మాహుతికైనా సిద్ధమేనని సందీప్ మావా చెబుతున్నారు.1990వ దశకంలో పండిట్ల ఊచకోతకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఫరూఖ్ అహ్మద్ దార్ అలియాస్ బిట్టా కరాటేపై చర్య తీసుకోవాలని మావా డిమాండ్ చేశారు.
శ్రీనగర్లోని ప్రెస్క్లబ్ వద్ద విక్రం కౌల్ ఆధ్వర్యంలో మరో కేవీవీ గ్రూప్ ధర్నా చేస్తున్నారు. ప్రధాని మోదీ పర్యటిస్తున్నందున ఈ ప్రాంతాన్ని ఖాళీ చేయాలని అధికారులు ఒత్తిడి తెస్తున్నారని ఆందోళనకారులు చెబుతున్నారు. 1990ల్లో కశ్మీర్లో ఉగ్రవాద చర్యలు మొదలైనప్పటి నుంచి దేవాలయాల ధ్వంసం, సామూహిక హత్యలపై విచారణ జరుపాలని కోరుతూ ముథి ఘాట్ వద్ద సుమారు 200 మంది కేవీపీ సభ్యులు ధర్నా చేస్తున్నారు.
జమ్ముకశ్మీర్ అంతటా రూ.20 వేల కోట్ల విలువ గల వివిధ అభివృద్ధి పథకాలకు ప్రధాని నరేంద్రమోదీ శంకుస్థాపనలు చేశారు. ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో కశ్మీర్ లోయ అంతటా భద్రత కట్టుదిట్టం చేశారు. కశ్మీర్, జమ్ము రీజియన్లను అనుసంధానించే బానిహల్-ఖ్వాజిగుండ్ రోడ్ టన్నెల్ను జాతికి అంకితం చేశారు.