ఇంఫాల్: హింసాత్మక సంఘటనలు, అల్లర్లతో అట్టుడుగుతున్న మణిపూర్లో జరుగుతున్న దారుణాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. మే 4న కాంగ్పోక్పి జిల్లాకు చెందిన ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించి ఆపై వారిపై సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ అమానుష వీడియో క్లిప్ జూలై 19న సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో యావత్ దేశం షాక్ అయ్యింది. అయితే అదే రోజున మరో దారుణం జరిగినట్లు తాజాగా బయటపడింది.
తూర్పు ఇంఫాల్ జిల్లాలోని కొనుంగ్ మమాంగ్ ప్రాంతంలో కార్లు వాషింగ్ చేసే ఇద్దరు మహిళలపై ఒక గుంపు దాడి చేసింది. 21, 24 ఏళ్ల వయస్సున్న వారిద్దరిని ఒక గదిలోకి తీసుకెళ్లి అత్యాచారం చేయాలని ఆ గుంపులోని కొందరు మహిళలు మగవారికి చెప్పారు. దీంతో వారిని గదిలోకి తీసుకెళ్లి మంచానికి కట్టేసి, కేకలు వినిపించకుండా నోర్లు మూసివేశారు. ఆ మహిళలపై సుమారు గంటన్నరపాటు పలువురు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం వారి జుట్టు కత్తిరించి చంపేశారు. మృతదేహాలను ఈడ్చుకెళ్లి ఒక మిల్లు సమీపంలో పడేశారు. ఆ తర్వాత ఆ మహిళల మృతదేహాలు మాయమయ్యాయి.
కాగా, మే 4న జరిగిన ఈ దారుణ సంఘటన గురించి ఒక మహిళ తల్లి ధైర్యం చేసి నోరు విప్పింది. మే 16న సాయికుల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ కేసును ఇంఫాల్ ఈస్ట్ జిల్లాలోని మరో పోలీస్ స్టేషన్కు బదిలీ చేశారు. సుమారు వంద నుంచి రెండొందల మందితో కూడిన గుంపు ఆ ఇద్దరు మహిళలపై దాడికి పాల్పడినట్లు ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. అయితే వారి ఆచూకీ లేదా మృతదేహాలను ఇంకా గుర్తించలేదని బాధిత కుటుంబ సభ్యులు మీడియాకు చెప్పారు.