పాట్నా: బీహార్ సీఎం నితీశ్ కుమార్ (Nitish Kumar) పై ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సామ్రాట్ చౌదరి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రానున్న కాలంలో నితీశ్ కుమార్పై బీజేపీ కార్యకర్తలు ప్రతీకారం తీర్చుకుంటారని, ఆయనను మట్టిలో కలిపేస్తారని (మిట్టి మే మిలా దేంగే – mitti me mila denge) అని అన్నారు. మీడియాతో శనివారం మాట్లాడిన సామ్రాట్ చౌదరి, సీఎం నితీశ్ కుమార్పై ఈ మేరకు పలు విమర్శలు చేశారు. చాలా యూ టర్న్లు తీసుకున్న ఆయనను చూడటానికి ప్రజలు సిద్ధంగా లేరని అన్నారు. 2020లో నితీశ్ కుమార్ను సీఎంగా చేసి ప్రధాని తన హామీని నెరవేర్చారని తెలిపారు. ఆ తర్వాత కూడా ఆయన బీజేపీ నుంచి పారిపోయారని, ఆర్జేడీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేశారని విమర్శించారు. ఈ నేపథ్యంలో ప్రతి బీజేపీ కార్యకర్త ప్రతీకారం తీర్చుకోవాలని పిలుపునిచ్చారు. ‘నితీశ్ కుమార్ను రాజకీయంగా మట్టిలో కలిపేయాలి. 2024, 2025లో ‘మిట్టి మే మిలా దేంగే’ అని బీజేపీ కార్యకర్తలు సంకల్పం చేయాలి’ అని అన్నారు.
కాగా, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఇటీవల ఆ రాష్ట్రంలోని మాఫియాపై అసెంబ్లీలో మండిపడ్డారు.
‘మిట్టి మే మిలా దేంగే’ అని హెచ్చరించారు. బీహార్ బీజేపీ అధ్యక్షుడు సామ్రాట్ చౌదరి కూడా ఇదే తరహాలో సీఎం నితీశ్ కుమార్పై ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో దీనిపై స్పందించాలని సీఎం నితీశ్ కుమార్ను రిపోర్టర్లు ఆదివారం అడిగారు. దీంతో ఆయన తనదైన శైలిలో సమాధానమిచ్చారు.‘ఆయన ( సామ్రాట్ చౌదరి) అలా అంటే అదే చెయ్యమని చెప్పండి. ‘మెదడు లేనోళ్లే’ ఇలాంటి మాటలంటారు’ అని మండిపడ్డారు. తానెప్పుడు ఎవరిపైనా అలాంటి వ్యాఖ్యలు చేయలేదన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు చేసే బీజేపీ నేతలు బుద్ధిహీనులని విమర్శించారు. ‘వారు ఏం చేయాలనుకుంటే అది చేసే స్వేచ్ఛ వారికి ఉంది. కొత్త తరం బీజేపీ నేతలకు బుర్ర లేదు’ అని ఎద్దేవా చేశారు.
మరోవైపు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని 2024 లోక్సభ ఎన్నికల్లో గద్దె దించేందుకు విపక్షాల ఐక్యత కోసం తాను కృషి చేస్తున్నట్లు సీఎం నితీశ్ కుమార్ తెలిపారు. ఇందులో భాగంగా ఏప్రిల్ 25న పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని కలిసే అవకాశం ఉందన్నారు. ఆ సమావేశం తర్వాతే దాని గురించి తాను మాట్లాడతానని అన్నారు. ప్రతిపక్షాల ఐక్యత కోసం పని చేస్తున్న తనకు ఎలాంటి వ్యక్తిగత ఆశయం లేదన్నారు. దేశ ప్రయోజనాల కోసమే తాను పని చేస్తున్నట్లు ఆయన చెప్పారు. ‘ఈరోజు కొంత మంది చరిత్రను మార్చేందుకు నరకయాతన పడుతున్నారు. ప్రతిపక్షాలు కలిసి ఉంటేనే దేశం కూడా సురక్షితంగా ఉంటుంది’ అని నితీశ్ కుమార్ అన్నారు.
#WATCH | On Bihar BJP chief Samrat Choudhary's "mitti mein mila denge" remark for Nitish Kumar Govt in the state, CM says, "If he is saying that, tell him to do it. Those who use such words have no brain…" pic.twitter.com/BwL7rXPpWW
— ANI (@ANI) April 23, 2023