ఖమ్మం, ఏప్రిల్ 28: తెలంగాణ సారథి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బస్సుయాత్రను విజయవంతం చేయాలని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర పిలుపునిచ్చారు. ఈ నెల 29, 30, మే 1 తేదీల్లో ఖమ్మం, కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాలో నిర్వహించనున్న రోడ్షోలకు ఆయా జిల్లాల ప్రజలు పెద్ద సంఖ్యలో తరలిరావాలని కోరారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. స్వరాష్ట్ర సాధన కోసం 14 ఏళ్లపాటు మహోద్యమాన్ని నడిపిన రథసారథి కేసీఆర్ తెలంగాణ ప్రజల చిరకాల వాంఛను సాకారం చేశారని, పదేళ్లపాటు అద్భుత పాలన అందించారని గుర్తుచేశారు.
అయితే, అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో కాంగ్రెస్ నాయకుల మోసపు వాగ్దానాలకు ప్రజలు కొంత గందరగోళానికి గురి కావడంతో అధికార మార్పిడి జరిగిందని అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ నెరవేర్చకపోవడంతో ఆ ప్రభుత్వాన్ని నిలదీసేందుకు, తీవ్ర కరువు పరిస్థితుల్లో ప్రజలకు అండగా నిలిచేందుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బస్సుయాత్ర చేపట్టారని వివరించారు. ఈ పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపు కోసం పార్టీ అధినేత బయలుదేరారని, సోమవారం నుంచి మూడు రోజులపాటు ఖమ్మం, కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల్లో రోడ్షోల్లో ఆయన ప్రసంగించనున్నారని వివరించారు. ఈ బస్సుయాత్రను, రోడ్షోను ఆయా జిల్లాల ప్రజలు విజయవంతం చేయాలని కోరారు.