లక్నో, జనవరి 3: ప్రపంచాన్ని కలవరపెడుతున్న కరోనా మహమ్మారిని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తేలిగ్గా తీసిపారేశారు. ప్రస్తుతం వేగంగా విస్తరిస్తున్న ఒమిక్రాన్ వేరియంట్ ‘కేవలం ఓ సాధారణ వైరల్ జ్వరం’ మాత్రమేనని చెప్పారు. అయినప్పటికీ జాగ్రత్తలు పాటించడం ముఖ్యమేనని పేర్కొన్నారు. లక్నోలో సోమవారం 15-18 ఏండ్ల పిల్లలకు నిర్వహించిన కొవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని పరిశీలించిన తర్వాత ఆయన విలేకర్లతో మాట్లాడారు. ‘ప్రస్తుతం ఒమిక్రాన్ వేరియంట్ వేగంగా విస్తరిస్తున్న మాట నిజమే. కానీ కొవిడ్ సెకండ్ వేవ్లో వ్యాప్తి చెందిన వేరియంట్తో పోలిస్తే ఒమిక్రాన్ వేరియంట్ చాలా బలహీనంగా ఉన్నదన్న విషయం కూడా వాస్తవమే. దీని గురించి భయపడాల్సిన అవసరం లేదు. ఇది కేవలం ఓ సాధారణ వైరల్ జ్వరం మాత్రమే. అయినప్పటికీ ఏ వ్యాధి విషయంలోనైనా జాగ్రత్తలు, ముందుజాగ్రత్తలు పాటించడం ముఖ్యమే’ అని యోగి ఆదిత్యనాథ్ చెప్పారు.