Om Birla : విపక్షాలు తనకు వ్యతిరేకంగా ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం (No-confidence motion) వీగిపోయిన నేపథ్యంలో ఇవాళ (గురువారం) లోక్సభ స్పీకర్ (Lok Sabha Speaker) ఓం బిర్లా స్పందించారు. తాను ఎల్లప్పుడూ ప్రతి ఎంపీకి సభలో మాట్లాడే అవకాశం కల్పించడానికి ప్రయత్నిస్తానని అన్నారు. సభ నియమ నిబంధనలకు ఎవరూ అతీతులుకారని చెప్పారు.
లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్గాంధీని ఉద్దేశించి స్పీకర్ ఓంబిర్లా ఈ వ్యాఖ్యలు చేశారు. తాను ఎంపీల మైక్రోఫోన్లను నియంత్రించాననే ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదన్నారు. సభలో ఎవరికీ ప్రత్యేక వెసులుబాట్లు ఉండవని చెప్పారు. నిబంధనల ప్రకారమే కార్యకలాపాలు నడుస్తాయన్నారు. ప్రధాని, మంత్రులు కూడా ఏదైనా ప్రకటన చేయడానికి ముందు సభ నిబంధనల ప్రకారం నోటీసులు ఇవ్వాలని చెప్పారు.
మైక్రోఫోన్లను ఆన్ లేదా ఆఫ్ చేయడానికి స్పీకర్ దగ్గర ఎలాంటి బటన్ ఉండదని అన్నారు. ఈ విషయం విపక్ష నేతలకు కూడా తెలుసని చెప్పారు. మాట్లాడేందుకు అనుమతి ఉన్న సభ్యుడికి మాత్రమే మైక్రోఫోన్ ఆన్ అవుతుందని తెలిపారు. తనపై విపక్షాలు కొంతకాలంగా చేస్తున్న విమర్శలకు ఓంబిర్లా ఈ విధంగా సమాధానం ఇచ్చారు. విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై రెండ్రోజుల చర్చ అనంతరం బుధవారం సాయంత్రం ఓటింగ్ జరిగింది. మూజుబాని ఓటుతో అది వీగిపోయింది.
రాష్ట్రపతికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చలో మాట్లాడేందుకు విపక్ష నేత రాహుల్గాంధీకి అవకాశం ఇవ్వకపోవడం, ఎనిమిది మంది సభ్యులపై సస్పెన్షన్ వేటు వేయడం, కాంగ్రెస్ మహిళా ఎంపీలపై నిరాధార ఆరోపణలు చేసిన బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబెపై చర్యలు చేపట్టకపోవడం లాంటి కారణాలతో విపక్షాలు ఈ అవిశ్వాస తీర్మానాన్ని తీసుకొచ్చాయి. అవిశ్వాస తీర్మానం ప్రక్రియ పూర్తయ్యేవరకు సభకు దూరంగా ఉన్న స్పీకర్.. తీర్మానం వీగిపోగానే మళ్లీ యథావిధిగా విధులకు హాజరయ్యారు.