Kolkat | కోల్కతా (Kolkata)లోని ఆర్జీ కార్ మెడికల్ కాలేజీ ( RG Kar Medical College), హాస్పిటల్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ ట్రైనీ వైద్యురాలిపై అత్యాచారం, హత్య (Doctor Rape Murder) ఘటన దేశ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతోంది. ఈ ఘటనకు నిరసనగా దేశవ్యాప్తంగా పలు ఆసుపత్రుల వైద్యులు సోమవారం నిరవధిక సమ్మెకు దిగారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో భయానక ఘటనకు కొద్ది క్షణాల ముందు మృతురాలు నలుగురు సహచరులతో కలిసి పారిస్ ఒలింపిక్స్ను వీక్షించినట్లు తెలిసింది.
నీరజ్ చోప్రా జావెలిన్ త్రో ఫైనల్ గేమ్ను వీక్షించినట్లు తోటి సిబ్బంది తాజాగా వెల్లడించారు. గురువారం రాత్రి విధుల్లోకి వచ్చిన ఆమె.. తోటి సిబ్బందితో కలిసి ఒలింపిక్స్ పోటీలను వీక్షించారు. నీరజ్ చోప్రా జావెలిన్ త్రో ఫైనల్ను ఆస్వాదించారు. అదే సమయంలో తన సహచరులతో కలిసి డిన్నర్ చేశారు. డిన్నర్ ఫినిష్ చేసి తన తల్లికి ఫోన్ చేసి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత కొద్దిసేపటికి సహోద్యోగులు విధుల్లోకి వెళ్లిపోయారు. బాధితురాలు మాత్రం చదువుకునేందుకు సెమినార్ హాల్కి వెళ్లిపోయినట్లు తోటి సిబ్బంది వివరించారు.
అసలేమైందంటే..?
ఛాతీ వైద్య విభాగంలో పీజీ రెండో సంవత్సరం విద్యార్థిని అయిన బాధితురాలు గురువారం రాత్రి డ్యూటీలో ఉండగా ఆమెను హత్య చేశారు. సెమినార్ హాల్లో అర్ధనగ్నంగా పడిఉన్న ఆమె దేహంపై గాయాల గుర్తులున్నాయి. ఈ కేసులో నిందితుడు సంజయ్ రాయ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. అతడు హాస్పిటల్తో ఎలాంటి సంబంధం లేని బయటి వ్యక్తి అని, ఘటన జరిగిన రోజు అతను దవాఖానలోని అన్ని విభాగాలలో స్వేచ్ఛగా తిరిగాడని పోలీసులు శనివారం తెలిపారు. అతని కదలికలు అనుమానాస్పదంగా ఉన్నాయని, ఈ నేరంతో అతడికి ప్రత్యక్ష సంబంధం ఉన్నట్టు అనుమానిస్తున్నట్టు వారు చెప్పారు. అతడిని అదుపులోకి తీసుకొని సెల్దా కోర్టులో హాజరుపర్చగా న్యాయస్థానం 14 రోజుల పోలీస్ రిమాండ్కు ఆదేశించింది.
పోస్ట్ గ్రాడ్యుయేట్ ట్రైనీ డాక్టర్ శవ పరీక్ష నివేదిక వెలువడింది. అందులో బాధితురాలి కళ్లు, నోరు, అంతర్గత అవయవాల నుంచి రక్తస్రావం అయినట్లు ఉంది. ఆమెపై లైంగిక దాడి చేసిన అనంతరం హత్య చేసినట్టు అది నిర్ధారించింది. ఈ కేసుకు సంబంధించి ఇద్దరు డాక్టర్లను కూడా పోలీసులు విచారిస్తున్నారు. తన కుమార్తెపై అత్యాచారం చేసి హత్య చేశారని బాధితురాలి తండ్రి ఆరోపించారు. అయితే వాస్తవాలు కప్పిపుచ్చడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు. ఇది ఒక దురదృష్టకర ఘటన అని, హంతకుడికి ఉరి శిక్ష వేయించడానికి తమ ప్రభుత్వం వెనుకాడదని బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు.
దర్యాప్తునకు దీదీ డెడ్లైన్
ఈ ఘటనపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ పోలీసులకు డెడ్లైన్ విధించారు. ఆదివారంలోగా ఈ కేసును ఓ కొలిక్కితీసుకురాకుంటే సీబీఐకి అప్పగిస్తామని స్పష్టం చేశారు. ఈ ఘటనపై తనకు కోల్కతా పోలీస్ కమిషనర్ సమాచారం అందించగానే విచారకర ఘటన అని చెప్పానని పేర్కొన్నారు. ఆస్పత్రిలో నర్సులు, సెక్యూరిటీ ఉండే క్రమంలో ఈ ఘటన ఎలా జరిగిందనేది తనకు అర్ధం కావడం లేదని ఆమె అన్నారు.
ఆర్జీ కార్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ రాజీనామా
మరోవైపు ఈ ఘటన నేపథ్యంలో ఆర్జీ కార్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ సందీప్ ఘోష్ (Dr Sandip Ghosh) రాజీనామా చేశారు (Principal Quits). సోషల్ మీడియాలో జరుగుతున్న అవమానాన్ని తాను భరించలేకపోతున్నానని వ్యాఖ్యానించారు. ‘నా పేరుతో రాజకీయ ప్రకటనలు చేస్తున్నారు. నా వ్యాఖ్యల్ని వక్రీకరిస్తున్నారు. సోషల్ మీడియాలో జరుగుతున్న అవమానాన్ని భరించలేకపోతున్నా. నన్ను తొలగించేందుకే కొందరు కుట్రపన్ని విద్యార్థులను రెచ్చగొడుతున్నారు. నిందితులకు శిక్ష పడాలని కోరుతున్నాను. చనిపోయిన అమ్మాయి నా కూతురు లాంటిది. నేను కూడా ఓ పేరెంట్నే.. పేరెంట్గానే రిజైన్ చేస్తున్నాను’ అని డాక్టర్ ఘోష్ తెలిపారు. తాను ఓ ఆర్థోపెడిక్ సర్జన్ని అని జీవనోపాధి పొందగలనని ఈ సందర్భంగా ఘోష్ పేర్కొన్నారు. ‘సందీప్ ఘోష్ రాజీనామా చేయలేరని అందరూ అనుకున్నారు. నేను నిజాయితీ పరుడిని. ఈ బాధ్యతలు చేపట్టాక అవినీతిని అరికట్టాను. ఆసుపత్రి అభివృద్ధికి, రోగుల ప్రయోజనాలకు ఎంతో కృషి చేశాను’ అని వ్యాఖ్యానించారు.
Also Read..
PM Modi | వరుసగా 11వ సారి.. మరో అరుదైన ఘనత సాధించబోతున్న ప్రధాని మోదీ
Bangladesh | హిందూ సమాజానికి క్షమాపణలు చెప్పిన బంగ్లా తాత్కాలిక ప్రభుత్వం
Supreme Court | హైవేలు ఉన్నది ట్రాక్టర్ల పార్కింగ్ కోసం కాదు.. సుప్రీంకోర్టు వ్యాఖ్యలు..!