లక్నో, ఫిబ్రవరి 27: సమాజ్వాది పార్టీ నేత, దేశంలోనే అత్యంత వృద్ధ ఎంపీ అయిన 93 ఏండ్ల షఫీకర్ రెహమాన్ బర్క్ మంగళవారం మృతి చెందారు. అనారోగ్యంతో చికిత్స పొందుతూ మొరాదాబాద్లోని ఒక ప్రైవేట్ దవాఖానలో ఆయన తుదిశ్వాస విడిచారు. 1930 జూలై 11న సంభల్లో జన్మించిన బర్క్ నాలుగుసార్లు ఎమ్మెల్యేగా, ఐదుసార్లు ఎంపీగా ఎన్నికయ్యారు.
మొర్దాబాద్ నుంచి మూడుసార్లు, సంభల్ నుంచి రెండుసార్లు ఎంపీగా గెలుపొందారు. ఆయన మృతికి పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్, ఇతర పార్టీ నేతలు సంతాపం వ్యక్తం చేశారు. గతంలో రెహమాన్ చర్యలు కొన్ని వివాదాస్పదంగా మారాయి. వందేమాతరం ఇస్లాంకు వ్యతిరేకంగా ఉందని అనడం, అఫ్గాన్లోని తాలిబన్ల చర్యను భారత స్వాతంత్య్ర పోరాటంతో పోల్చడం వివాదం రేపాయి.