పాట్నా: దేశం పేరును ‘ఇండియా’ నుంచి ‘భారత్’గా కేంద్ర ప్రభుత్వం మార్చవచ్చన్న ఊహాగానాలు జోరందుకున్నాయి. దీంతో భారత దేశం పేరు మార్పుపై అన్ని వర్గాల్లో పెద్ద చర్చ జరుగుతున్నది. ఈ నేపథ్యంలో బీహార్ మాజీ సీఎం, ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ (Lalu Yadav’s old video) గతంలో ‘ఇండియా, భారత్’ మధ్య వ్యత్యాస్యం గురించి మాట్లాడారు. ఈ పాత వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
కాగా, ఈ వీడియోలో లాలూ ప్రసాద్ యాదవ్ వేప పుల్లతో పళ్లు తోముకుంటారు. ఈ సందర్భంగా ఆయనను ఇంటర్వ్యూ చేసిన జర్నలిస్ట్, మీరు ఎప్పుడైనా టూత్ బ్రష్ ఉపయోగించారా? అని ప్రశ్నించారు. దీనికి లాలూ తనదైన స్టైల్లో సమాధానమిచ్చారు. తాను ఢిల్లీలో మాత్రమే టూత్ బ్రష్తో పళ్లు తోముకుంటానని తెలిపారు. దీనికి కారణం కూడా చెప్పారు. ఢిల్లీని ‘ఇండియా’గా పేర్కొన్న ఆయన అక్కడ వేప పుల్లలు అంత సులువుగా లభించవని అన్నారు. అయితే బీహార్ రాజధాని పాట్నాను ‘భారత్’గా అభివర్ణించిన లాలూ, ఇక్కడ మాత్రం వేప పుల్లలు విరివిగా దొరుకుతాయని చెప్పారు.
మరోవైపు దేశం పేరు మార్పుపై చర్చ జరుగుతున్న తరుణంలో లాలూ ప్రసాద్ యాదవ్కు సంబంధించిన ఈ పాత వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో లాలూ గతంలోనే ‘భారత్’కు మద్దతుగా మాట్లాడారని కొందరు వ్యాఖ్యానించారు. అయితే విపక్షాల కూటమిని ‘ఇండియా’గా వ్యవహరించడం వల్లనే కేంద్రంలోని మోదీ ప్రభుత్వం దేశం పేరును ‘భారత్’గా మార్చాలని భావిస్తున్నదని మరి కొందరు విమర్శించారు. ఇస్రో పేరును బిస్రోగా మారుస్తారా అని కొందరు ఎద్దేవా చేశారు.
Lallu said it long ago
😂😂😂 #BharatVsIndia
pic.twitter.com/7qLHVMju67— Dr MJ Augustine Vinod 🇮🇳 (@mjavinod) September 5, 2023