ప్రస్తుతం ఏ కాకా హోటల్ వెళ్లినా ఒక్క సమోసా తినాలంటే కనీసం 10 రూపాయలు వెచ్చించాల్సిందే. కొంచెం రెస్టారెంట్ టైప్ హోటల్స్కు వెళితే ఒక్క సమోసా తినాలంటే కనీసం 20 రూపాయలు పెట్టాల్సిందే. కానీ.. ఓ పెద్దాయన మాత్రం ఒక్క సమోసాను కేవలం రూ.2.50కే అమ్ముతున్నాడు. ఇప్పుడు కాదు.. చాలా ఏళ్ల నుంచి ఆ పెద్దాయన సమోసాను అతి తక్కువ ధరకే అమ్ముతూ టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యాడు.
అమృత్సర్కు చెందిన 75 ఏళ్ల వ్యక్తి స్థానికంగా సమోసాలు అమ్ముతూ జీవనం సాగిస్తున్నాడు. చాలా ఏళ్ల నుంచి సమోసా బిజినెస్ చేస్తున్నాడు. గతంలో ఒక్క సమోసాను కేవలం రూపాయికే అమ్మేవాడు. ఇటీవల దాని ధర రూ.1.50 పెంచి ఇప్పుడు కేవలం 2.50 రూపాయలకే అమ్ముతున్నాడు. సమోసాను చట్నీలో అద్దుకు తింటే ఆ టేస్టే వేరు.. అంటూ అక్కడి స్థానికులు ఆ సమోసా తినడం కోసం ఆ సెంటర్ వద్ద రోజూ క్యూ కడుతున్నారు. ఓ ఫుడ్ బ్లాగర్ పెద్దాయన సమోసా తయారు చేసే విధానాన్ని వీడియో తీసి తన ఇన్స్టా అకౌంట్లో షేర్ చేశాడు. దీంతో ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎటువంటి లాభాపేక్ష లేకుండా.. తక్కువ ధరకే ఏళ్ల నుంచి సమోసా అమ్ముతున్న పెద్దాయనకు నెటిజన్లు సెల్యూట్ చేస్తున్నారు.