పట్నా : దేశంలో చాలా మంది కరోనా టీకా రెండో డోసు కోసం వేచిచూస్తుండగా బిహార్కు చెందిన ఓ వ్యక్తి (84) ఏకంగా 11 కొవిడ్ టీకా డోసులు తీసుకున్నట్టు వెల్లడించారు. మధేపుర జిల్లా ఒరై గ్రామానికి చెందిన బ్రహ్మదేవ్ మండల్ 12వ డోసు తీసుకునే ముందు పట్టుబడ్డాడు. మండల్ ఇన్ని టీకా డోసులు ఎలా తీసుకున్నాడనేది నిగ్గుతేల్చేందుకు అధికారులు దర్యాప్తు చేపడతారని మధేపుర జిల్లా సివిల్ సర్జన్ తెలిపారు.
టీకా తనకు మెరుగైన ప్రయోజనాలు అందిస్తుందని తాను 11 డోసులు తీసుకున్నానని..టీకా తీసుకోవడం ద్వారా తనకు మంచి జరిగిందని అందుకే తాను మళ్లీ, మళ్లీ టీకా వేయించుకున్నానని మండల్ చెప్పుకొచ్చారు. పోస్టల్ శాఖలో పనిచేసి పదవీ విరమణ పొందిన మండల్ గత ఏడాది పిబ్రవరి 13న వ్యాక్సిన్ తొలి డోసు తీసుకున్నాడు. ఫిబ్రవరి 13 నుంచి డిసెంబర్ 30 మధ్య ఆయన ఓ ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో ఏకంగా 11 డోసులు వేయించుకున్నాడు.
తాను ఏరోజు ఏ సమయంలో టీకా డోసులు తీసుకున్నదీ ఆయన వివరంగా చెబుతున్నాడు. ప్రతి ఒక్కరూ కరోనా టీకా తీసుకోవాలని మండల్ కోరుతున్నాడు. ఓ వ్యక్తి ఇన్ని సార్లు టీకా తీసుకోవడం వ్యవస్ధపై సందేహాలను ముందుకు తెస్తున్నది. మండల్ ఎనిమిది సార్లు తన ఆధార్ కార్డు, ఫోన్ నెంబర్ వివరాలను ఇవ్వగా, మరో మూడుసార్లు భార్య ఫోన్ నెంబర్ను ఇవ్వడం ద్వారా టీకా వేయించుకున్నాడని అధికారులు ఆరోపిస్తున్నారు. ఆఫ్లైన్ శిబిరాల్లో ఇలాంటివి జరుగుతున్నాయని అధికారులు అనుమానిస్తున్నారు.
ఆయా టీకా శిబిరాల్లో ఆధార్ కార్డు, ఫోన్ నెంబర్లను సేకరించే సిబ్బంది ఆ తర్వాత వాటిని డేటాబేస్లో ఎంటర్ చేస్తుంటారని చెబుతున్నారు. అందుకే కంప్యూటర్ డేటాలో, ఆఫ్లైన్ రిజిస్టర్లో వివరాల మధ్య కొన్నిసార్లు వ్యత్యాసం కనిపిస్తుంటుందని పేర్కొన్నారు. మండల్ అధికారుల కండ్లుగప్పి ఇన్నిసార్లు టీకా డోసులు ఎలా తీసుకోగలిగాడని దర్యాప్తు జరిపిస్తామని మధేపుర జిల్లా సివిల్ సర్జన్ అమరేంద్ర ప్రతాప్ సాహి స్పష్టం చేశారు.