చండీగఢ్: ఆయిల్ ట్యాంకర్, రోల్స్ రాయిస్ ఢీ కొన్నాయి (Tanker-Rolls Royce Collide). ఈ ప్రమాదంలో ట్యాంకర్లో ఉన్న ఇద్దరు మరణించగా లగ్జరీ కారులో ప్రయాణించిన ముగ్గురు ప్రాణాలతో బయటపడ్డారు. హర్యానాలోని నూహ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. మంగళవారం మధ్యాహ్నం ఢిల్లీ- ముంబై-బరోడా ఎక్స్ప్రెస్వేలోని ఉమ్రి గ్రామ సమీపంలో రాంగ్ రూట్లో వచ్చిన ఆయిల్ ట్యాంకర్ వేగంగా వెళ్తున్న రోల్స్ రాయిస్ను ఢీకొట్టింది. ట్యాంకర్ బోల్తాపడగా లగ్జరీ కారుకు మంటలంటుకున్నాయి.
కాగా, రోల్స్ రాయిస్ వెనుకే మరో కారులో వస్తున్న బంధువులు వేగంగా స్పందించారు. ట్యాంకర్ను ఢీకొని మంటల్లో కాలిపోతున్న లగ్జరీ కారులో చిక్కుకున్న ముగ్గురిని వెంటనే బయటకు తీశారు. చండీగఢ్కు చెందిన దివ్య, తస్బీర్, ఢిల్లీకి చెందిన వికాస్ అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడ్డారు. గాయపడిన వారిని గురుగ్రామ్లోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.
మరోవైపు రోల్స్ రాయిస్ను ఢీకొట్టి బోల్తాపడిన ఆయిల్ ట్యాంకర్లోని డ్రైవర్ రామ్ప్రీత్, అతడి సహాయకుడు కుల్దీప్ మరణించారు. మృతులిద్దరూ ఉత్తరప్రదేశ్కు చెందిన వారని పోలీసులు తెలిపారు. అందులో ఉన్న మరో వ్యక్తి గౌతమ్ గాయపడినట్లు చెప్పారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.