తన ఆఫీసు గదిలో ఆల్ఖైదా తీవ్రవాది ఒసామా బిన్లాడెన్ ఫొటో పెట్టుకున్న ప్రభుత్వ అధికారిపై సస్పెన్షన్ వేటు పడింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లో వెలుగు చూసింది. ఇక్కడి దక్షిణాంచల్ విద్యుత్ వితరణ్ నిగమ్ లిమిటెడ్ (డీవీవీఎన్ఎల్)లో సబ్డివిజనల్ ఆఫీసన్ (ఎస్డీవో)గా పనిచేసే రవీంద్ర ప్రకాష్ గౌతమ్ అనే అధికారిపై వేటు పడింది.
అతను తన ఆఫీసు గదిలో ఒసామా బిన్ లాడెన్ ఫొటో పెట్టుకున్నాడు. దాని కింద ‘‘గౌరవనీయులైన ఒసామా బిన్ లాడెన్, ప్రపంచంలోనే అత్యుత్తమ జూనియర్ ఇంజనీర్’’ అని రాసి ఉంది. ఈ ఫొటో నెట్టింట తెగ వైరల్ అయింది. దీంతో విషయం తెలుసుకున్న అధికారులు వెంటనే రంగంలోకి దిగి యాక్షన్ తీసుకున్నారు. రవీంద్రను సస్పెండ్ చేయడంతోపాటు అతని ఆఫీసులో ఉన్న బిన్ లాడెన్ ఫొటో కూడా తొలగించినట్లు అధికారులు చెప్పారు.
‘‘ఈ ఘటనపై దర్యాప్తు తర్వాత డీవీవీఎన్ఎల్ మేనేజింగ్ డైరెక్టర్ కఠిన నిర్ణయం తీసుకొని, ఎస్డీవో రవీంద్ర ప్రకాష్ గౌతమ్ను సస్పెండ్ చేశారు’’ అని ఫరూఖాబాద్ జిల్లా మేజిస్ట్రేట్ సంజయ్ కుమార్ సింగ్ తెలిపారు. అయితే ఎవరినైనా ఆరాధించే హక్కు తనకుందని, బిన్ లాడెన్ ప్రపంచంలోనే గొప్ప జూనియర్ ఇంజినీర్ అని రవీంద్ర వాదిస్తున్నారు.