భువనేశ్వర్ : ఒడిశాలో విజిలెన్స్ అధికారులు ఏకంగా ఒక పెద్ద అవినీతి తిమింగలాన్నే పట్టుకున్నారు. లంచం తీసుకుంటూ పట్టుబడిన భువనేశ్వర్కు చెందిన మైన్స్ శాఖ డిప్యూటీ డైరెక్టర్ దేవబ్రత మహంతి ఫ్లాట్లో విజిలెన్స్ అధికారులు మంగళవారం రాత్రి రూ.4 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. రాష్ట్రంలో ఇంత పెద్ద మొత్తంలో నగదును స్వాధీనం చేసుకోవడం ఇదే మొదటిసారని విజిలెన్స్ అధికారులు తెలిపారు. ఒక స్థానిక బొగ్గు వ్యాపారి నుంచి రూ.30 వేల లంచం తీసుకుంటుండగా మహంతిని పట్టుకుని అధికారులు అరెస్ట్ చేశారు.
అనంతరం విజిలెన్స్ శాఖ ఏకకాలంలో భువనేశ్వర్లోని ఆయన ఫ్లాట్, భద్రక్ జిల్లాలోని అతని సొంత ఇంట్లో, కటక్లోని కార్యాలయంలో దాడులు నిర్వహించారు. ఆయన ఆఫీస్ డ్రాయర్లో 1.20 లక్షల నగదుతో పాటు భువనేశ్వర్లోని ఫ్లాట్లో ట్రాలీ బ్యాగ్లలో దాచిన కట్టలకట్టల డబ్బు లభించింది. దీంతో పాటు 130 గ్రాముల బంగారం కూడా ఉంది. నగదును లెక్కించగా సుమారు 4 కోట్ల రూపాయలు ఉన్నట్టు వారు చెప్పారు. అంతకుముందు ఏసీబీ అధికారులు అత్యధిక మొత్తంలో స్వాధీనం చేసుకున్న నగదు రూ. 3.4 కోట్లు. మైనర్ ఇరిగేషన్ శాఖకు చెందిన ఒక అసిస్టెంట్ ఇంజినీర్ నుంచి 2022లో దీనిని స్వాధీనం చేసుకున్నారు.