Odisha Train Accident | ఒడిశా బాలాసోర్లో శుక్రవారం ఘోర రైలు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో 288 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 700 మందికిపైగా గాయపడగా ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో రైలు ప్రమాద బాధితులకు లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా క్లెయిమ్ సెటిల్మెంట్ ప్రక్రియలో పలు సడలింపులు ప్రకటించింది. రైలు ప్రమాదంపై దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిన ఎల్ఐసీ చైర్మన్.. ఈ మేరకు ప్రమాద బాధితులను ఆదుకునేందుకు సంస్థ కట్టుబడి ఉందన్నారు. క్లెయిన్లకు సంబంధించి ఉపశమనం కల్పిస్తున్నట్లు కంపెనీ పేర్కొంది.
ప్రమాదంలో మృతి చెందిన పాలసీ హోల్డర్లకు సంబంధించి రిజిస్టర్డ్ డెత్ సర్టిఫికేట్కు బదులుగా, రైల్వేలు, పోలీసులు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రచురించిన క్యాజువాలిటీ లిస్ట్ను మరణానికి రుజువుగా అంగీకరించనున్నట్లు పేర్కొంది. కార్పొరేషన్ సర్కిల్, బ్రాంచ్ స్థాయిలో ఒక ప్రత్యేక హెల్ప్ డెస్క్ను సైతం ఏర్పాటు చేసింది. అలాగే కాల్ సెంటర్ (022-68276827)ను సైతం ఏర్పాటు చేసింది. బాధిత కుటుంబాలకు సంబంధించిన క్లెయిమ్లు త్వరితగతిన పరిష్కరించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్లు ఎల్ఐసీ తెలిపింది.