Odisha Train Accident | ఒడిశా బాలాసోర్లో జరిగిన రైలు ప్రమాదం యావత్ భారతదేశాన్ని షాక్కు గురి చేసింది. ఇంత పెద్ద ప్రమాదం ఎలా జరిగింది? అనే ప్రశ్న అందరి మదిలో మెదులుతూనే ఉంది. ఈ ఘటనపై ఓ వైపు రైల్వేశాఖ బృందంతో పాటు సీబీఐ సైతం విచారణ జరుపుతున్నది. అయితే, రైలు ప్రమాదానికి సంబంధించిన కేసులో బహనగ బజార్ స్టేషన్ మాస్టర్తో సహా ఐదుగురు రైల్వో ఉద్యోగులను విచారిస్తున్నట్లు ఓ అధికారి తెలిపారు.
ప్రస్తుతం సిగ్నలింగ్లో పని చేస్తున్న ఓ ఉద్యోగి.. ఈ నెల మొదటల్లో ప్రమాదం జరిగిన సమయంలో విధుల్లో ఉన్నాడు. ఐదుగురు ఉద్యోగులు ప్రస్తుతం తమ విధులను నిర్వర్తిస్తున్నారని, రైల్వే సేఫ్టీ కమిషన్ (CRS) రూపొందించిన ప్రమాద దర్యాప్తు నివేదికపై భవిష్యత్ కార్యాచరణ ఆధారపడి ఉంటుందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. అయితే, సిస్టమ్ మాన్యువల్ ట్యాంపరింగ్, ఆటోమేటెడ్ సిగ్నలింగ్ సిస్టమ్ ఇంటరాలింగ్ సిస్టమ్లో లోపమే ఈ దుర్ఘటనకు ప్రధాన కారణమని భావిస్తున్నారు. ప్రస్తుతం ఐదుగురు సిబ్బంది కేంద్రంగా విచారణ జరుగుతుందని సీనియర్ అధికారి పేర్కొన్నారు.
త్వరలోనే సీఆర్ఎస్ నివేదిక రానున్నది. ఉద్దేశపూర్వకం చేశారా? అనుకోండా జరిగిందా? ఏమైనా సాంకేతిక లోపంతో జరిగిందా? అనే కోణంలో అధికారులు విచారణ జరుపుతున్నట్లు తెలుస్తున్నది. అయితే, రైలు ప్రమాదం ఘటన విషయంలో వస్తున్న రాజకీయ విమర్శలపై రైల్వే ఉద్యోగ సంఘాలు మండిపడుతున్నాయి. ఈ రైలు దుర్ఘటనను రాజకీయం చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. సోషల్ మీడియాలో జరుగుతున్న రైల్వే పనితీరుపై వస్తున్న విమర్శలను చూస్తుంటే బాధ ఉందని.. ఈ దాడి చిత్తశుద్ధిని, కర్తవ్య భక్తిని అవమానించడమేనని సంఘాలు పేర్కొన్నాయి.