Odisha | ఒడిశాలోని ఓ పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యం 69 మంది విద్యార్థుల పాలిట అశనిపాతంలా మారింది. వాళ్లందరి టెన్త్ మెమోలపై ఒకే విద్యార్థి ఫొటో రావడంతో వాళ్ల భవిష్యత్తు అయోమయంలో పడింది. వేరొకరి ఫొటో ఉందన్న కారణంతో ఇంటర్ ప్రవేశాల కోసం చేసుకున్న దరఖాస్తులు రిజెక్ట్ అవ్వడంతో బాధిత విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. అడ్మిషన్లు తిరస్కరించడంతో ఉన్నత చదువులు చదువుకోలేకపోతున్నామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఒడిశా కటక్ జిల్లాలోని నిశంతకోహిలీ మండలంలోని ఓ పాఠశాలకు చెందిన 69 మంది విద్యార్థుల టెన్త్ సర్టిఫికెట్లపై వేరొక విద్యార్థి ఫొటో వచ్చింది. అయితే బాధిత విద్యార్థుల కథనం ప్రకారం.. మొదటి సమ్మేటివ్ అసెస్మెంట్ సమయంలోనే హాల్టికెట్లపై వేరొక విద్యార్థి ఫొటో వచ్చింది. ఇది గమనించిన పాఠశాల యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లారు. విద్యార్థుల కంప్లయింట్పై స్పందించిన యాజమాన్యం రెండో సమ్మేటివ్ అసెస్మెంట్లో ఈ పొరపాటును సరిదిద్దుతామని హామీ ఇచ్చారు. కానీ రెండో సమ్మేటివ్ అసెస్మెంట్లో కూడా ఇదే తప్పు పునరావృతమైంది. ఇదేంటని విద్యార్థులు ప్రశ్నిస్తే.. హాల్ టికెట్లపై తమ ఫొటోలు అతికించి పరీక్షలు రాసేందుకు అనుమతించారు. తీరా మెట్రిక్యులేషన్ సర్టిఫికెట్లు వచ్చిన తర్వాత చూసుకుంటే ఎలాంటి మార్పు లేదు.
69 మంది విద్యార్థుల పదో తరగతి ఉత్తీర్ణత సర్టిఫికెట్లపై ఒకే ఫొటో ముద్రించారు. దీంతో బాధిత విద్యార్థులు ఇంటర్లో చేరేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అడ్మిషన్ల కోసం దరఖాస్తు చేసుకుంటే ఆయా కాలేజీలు వాటిని తిరస్కరిస్తున్నాయి. దీంతో బాధిత విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే దీనిపై తమకు ఎలాంటి ఫిర్యాదులు అందలేవని ఒడిశా బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ వైస్ ప్రెసిడెంట్ నిహార్ రంజన్ మొహంతి చెప్పారు. సాంకేతిక సమస్యల కారణంగా ఈ పొరపాటు జరిగి ఉంటే.. వెంటనే సవరించి బాధిత విద్యార్థులకు కొత్త సర్టిఫికెట్ల విడుదల చేస్తామని స్పష్టం చేశారు.