Nava Kishore Das | భువనేశ్వర్ దవాఖానలో చికిత్స పొందుతున్న ఒడిశా ఆరోగ్యశాఖ మంత్రి, అధికార బీజేడీ సీనియర్ నేత నవకిశోర్ దాస్ ఆదివారం సాయంత్రం మరణించారు. ఆదివారం ఉదయం నవ కిశోర్ దాస్పై ఏఎస్సై గోపాల్ దాస్ కాల్పులు జరినాడు. ఈ కాల్పుల్లో తీవ్రంగా గాయ పడిన నవకిశోర్ దాస్ను తొలుత హుటాహుటిన స్థానిక దవాఖానకు తరలించారు. పరిస్థితి విషమించడతో మెరుగైన చికిత్స కోసం ఎయిర్ అంబులెన్స్లో భువనేశ్వర్కు తరలించారు.
కాగా, మంత్రి కాల్పులు జరిపిన ఏఎస్సై గోపాల్దాస్ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అయితే, మంత్రిపై అతడు ఎందుకు కాల్పులు జరుపాల్సి వచ్చిందనే విషయంలో స్పష్టత రాలేదని పోలీసులు చెప్పారు. మరోవైపు ఈ ఘటనపై ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ సీఐడీ విచారణకు ఆదేశించారు.
మంత్రి నవ కిశోర్ దాస్ ఆదివారం ఉదయం ఝార్సిగూడ జిల్లా బ్రజరాజునగర్లోని గాంధీచౌక్ దగ్గర ఓ ఆలయంలో జరిగే కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చారు. ఆయన ఆలయం వద్ద కారు దిగుతుండగానే ఎఎస్సై గోపాల్ దాస్ కాల్పులు జరిపాడు. నేరుగా మంత్రి నవకిశోర్ దాస్ ఛాతిలోకి బుల్లెట్లు దూసుకుపోవడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. తొలుత గుర్తు తెలియని ఆగంతకులు మంత్రి నవ కిశోర్ దాస్ మీద కాల్పులు జరిపినట్లు ప్రకటించిన పోలీసులు.. తర్వాత ఆ కాల్పులు జరిపింది ఎఎస్సై గోపాల్ దాస్ అని గుర్తించారు.