Snake | ఒడిశాలో ఓ వ్యక్తి (Odisha Man) భార్య, బిడ్డ పట్ల కర్కశంగా వ్యవహరించాడు. ఇంట్లోని గదిలో నిద్రిస్తున్న సమయంలో పామును వదిలి వారిని చాలా తెలివిగా హత్య చేశాడు. గంజాం జిల్లాలోని కబి సూర్యనగర్ పోలీస్ స్టేషన్ (Kabisurya Nagar police station) పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అధీగావ్ గ్రామానికి చెందిన 25 ఏళ్ల గణేశ్ పాత్రాకు బసంతి పాత్రా (23)తో 2020లో వివాహమైంది. వీరికి రెండున్నరేళ్ల కుమార్తె దేబాస్మిత ఉంది. అయితే గణేశ్ తన భార్య బసంతితో తరచూ గొడవపడేవాడు. ఈ క్రమంలో ఆమెను అంతమొందించాలని భావించాడు. ఇందుకోసం ఎవరికీ అనుమానం రాకుండా హత్యకు ఓ పాము (Snake)ను వాడుకున్నాడు. పాములు పట్టే వ్యక్తి నుంచి విషపూరిత పాము (venomous snake)ను సంపాదించి ఓ ప్లాస్టిక్ జార్లో అక్టోబర్ 6న ఇంటికి తీసుకొచ్చాడు. రాత్రి సమయంలో నిద్రిస్తున్న భార్య, కుమార్తె గదిలోకి పామును వదిలాడు (Releasing Snake In Room). ఆ తర్వాత అతడు వేరే గదిలోకి వెళ్లి నిద్రపోయాడు. మరుసటి రోజు తెల్లారేసరికి వారిద్దరూ విషం కక్కుకుని చనిపోయి కనిపించారు.
అయితే, వీరి మృతిపై అనుమానం వ్యక్తం చేసిన బసంతి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల జోక్యంతో ఘటన జరిగిన నెలన్నర తర్వాత అసలు విషయం బయటపడింది. దర్యాప్తులో భాగంగా గణేశ్ తీరుపై అనుమానంతో పోలీసులు అతడిని విచారించారు. తొలుత ఆరోపణలను ఖండించినా పోలీసులు గట్టిగా ప్రశ్నించే సరికి అసలు విషయం బయటపెట్టాడు. వారి గదిలోకి తానే పామును వదిలినట్టు అంగీకరించాడు. దీంతో పోలీసులు అతడిపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు.
Also Read..
Dublin | చిన్నారులపై కత్తితో దాడిచేసిన దుండగుడు.. ఐర్లాండ్లో తీవ్ర ఉద్రిక్తత
Israel-Hamas War | నేటి నుంచి ఇజ్రాయెల్-హమాస్ మధ్య కాల్పుల విరమణ.. బందీల విడుదల ప్రారంభం
బ్రిటన్ వీసాల్లో మనోళ్లదే అగ్రస్థానం