గాజా: ఏడు వారాలుగా కొనసాగుతున్న ఇజ్రాయెల్- హమాస్ యుద్ధానికి (Israel-Hamas War) కాస్త విరామం లభించింది. ఇరుపక్షాల దాడులు, ప్రతి దాడులతో విరుచుకుపడిన ఇరుపక్షాల మధ్య ఎట్టకేలకు కాల్పుల విరమణ ఒప్పందం (Ceasefire) కుదిరింది. సుదీర్ఘంగా కొనసాగిన సంప్రదింపుల అనంతరం నాలుగు రోజులపాటు కాల్పుల విరణమకు ఇజ్రాయెల్, హమాస్ (Hamas) ఒప్పుకున్నాయి. శుక్రవారం ఉదయం 10.30 గంటల నుంచి ఇది అమల్లోకి వచ్చింది. దీంతో బందీల (Hostages) విడుదల ప్రక్రియ ప్రారంభం కానుంది. అదేవిధంగా మానవతా సాయానికీ మార్గం సుగమమయింది. దీంతో అక్టోబర్ 7న ప్రారంభమైన యుద్ధానికి తొలిసారి బ్రేక్ పడింది.
ఈ నాలుగు రోజుల్లో ఇరు పక్షాలు విడుదల వారీగా బందీలను విడుదల చేయనున్నారు. ఇందులో భాగంగా హమాస్ 50 మందిని విడిచిపెట్టనుండగా, ఇజ్రాయెల్ 150 మందిని వదిలిపెట్టనుంది. ఈ ప్రక్రియ శుక్రవారం సాయంత్రానికి పూర్తి కానుంది. తొలివిడుతలో హామాస్ తన వద్ద బందీలుగా ఉన్న 13 మందిని వదిలేయనుంది. ఇందులో మహిళలు, చిన్నారులు ఉన్నారు. కాగా, విడుదలకు అర్హులైన 300 మంది జాబితాను ఇజ్రాయెల్ ఇప్పటికే ప్రకటించింది. అదేవిధంగా పాలస్తీనాకు మానవతా సాయానికి అంగీకరించింది. ఇరుపక్షాలకు మధ్యవర్తిగా ఖతార్ (Qatar) వ్యవహరిస్తున్నది. వాస్తవానికి గురువారం సాయంత్రమే ఈ ఒప్పందం అమల్లోకి రావాల్సి ఉండగా, పలు కారణాల వల్ల వాయిదాపడింది.
దీంతో అక్టోబర్ 7న ఇజ్రాయెల్, హమాస్ మధ్య యుద్ధం మొదలైంది. ఇప్పటివరకు 13,300 గాజా పౌరులు మంది మరణించారు. మరో 6 వేల మంది గల్లంతయ్యారు. ఇకా ఇజ్రాయెల్కు చెందిన 1200 మంది మృతిచెందారు. హమాస్కు స్థావరంగా ఉన్న గాజా స్ట్రిప్ ఇజ్రాయెల్ సైన్యం దాడిలో పూర్తిగా ధ్వంసమయింది. భారీ సంఖ్యలో భవనాలు నేలమట్టమయ్యాయి. సుమారు 2 లక్షల మంది పాలస్తీనియన్లు గాజాను వదిలివెళ్లిపోయారు.