బెరంపుర్: ఒడిశాలోని గంజామ్ జిల్లాలో ఉన్న బెరంపూర్లో ఇవాళ ప్రధాని మోదీ(PM Modi) ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఓ సభలో మాట్లాడుతూ.. ఒడిశా చాలా సంపన్నమైన రాష్ట్రమని, కానీ ఈ రాష్ట్ర ప్రజలు పేదవాళ్లుగానే ఉండిపోయారని ఆయన ఆరోపించారు. ఒడిశా ప్రజలు పేదలుగా మిగిలిపోవడానికి కాంగ్రెస్, బీజేడీ పార్టీలే కారణమని మోదీ పేర్కొన్నారు. రాష్ట్రంలో సంపన్న వనరులు ఉన్నా.. ప్రజల్ని పేదలుగా మార్చిన ఘనత ఆ రెండు పార్టీలకు చెందుతుందని ఆయన విమర్శించారు. జూన్ 4వ తేదీ బీజేడీ పార్టీకి ఎక్స్పైరీ డేట్ అంటూ ప్రధాని మోదీ పేర్కొన్నారు. త్వరలోనే డుబల్ ఇంజిన్ ప్రభుత్వం ఒడిశాలో ఏర్పాటు అవుతుందని మోదీ తెలిపారు. కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ బీజేపీ కొత్త సర్కార్లను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన వెల్లడించారు.