భువనేశ్వర్: ఒడిశాలో ప్రాణాంతక బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ స్క్రబ్ టైఫస్ (Scrub Typhus), లెప్టోస్పైరోసిస్ (Leptospirosis) వ్యాధులు కలకలం రేపుతున్నాయి. బార్గఢ్ జిల్లాలో స్క్రబ్ టైఫస్ బారినపడి ఐదుగురు మరణించారు. దాంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. స్క్రబ్ టైఫస్ మరింత విస్తరించకుండా తక్షణమే తగిన చర్యలు తీసుకోవాలని అన్ని జిల్లాల ఆరోగ్య విభాగం అధికారులకు ఒడిశా ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఆదేశాలు జారీచేసింది.
అన్ని జిల్లాల చీఫ్ మెడికల్ అధికారులకు, ప్రజారోగ్య అధికారులకు, భువనేశ్వర్లోని క్యాపిటల్ హాస్పిటల్ డైరెక్టర్కు, రూర్కెలా RGH డైరెక్టర్కు ఆరోగ్య శాఖ స్క్రబ్ టైఫస్ నిర్మూలనకు అవసరమైన సూచనలు చేసింది. వ్యాధిని త్వరగా గుర్తించి తక్షణమే చికిత్స అందించేలా అనుక్షణం పర్యవేక్షణ కొనసాగించాలని సూచించింది. అన్ని జిల్లాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో స్క్రబ్ టైఫస్ నిర్ధారణ పరీక్షలు అందుబాటులో ఉండేలా చూడాలని, అందుకు కావాల్సినన్ని టెస్ట్ కిట్స్ను సరఫరా చేయాలని ఆదేశాల్లో పేర్కొన్నది.
ప్రజల్లో కూడా స్క్రబ్ టైఫస్ విస్తృతిపై అవగాహన కల్పించాలని అన్ని జిల్లాల ఆరోగ్య అధికారులకు ఒడిశా ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సూచించింది. స్క్రబ్ టైఫస్ మరణాలపై సమగ్ర విచారణ చేస్తూ దాని నియంత్రణకు అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించింది. కాగా, ఈ స్క్రబ్ టైఫస్నే బుష్ టైఫస్ (BUSH typhus) అని కూడా అంటారు. ఓరియెంటా సుసుగాముషి (Orienta tsutsugamushi) అనే బ్యాక్టీరియా వల్ల ఈ వ్యాధి సోకుతుంది. ఈ బ్యాక్టీరియా సోకిన కీటకాలు కుట్టడం ద్వారా జనాల్లో ఈ వ్యాధి విస్తరిస్తుంది.