(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, మార్చి 26 (నమస్తే తెలంగాణ): భారత తీరప్రాంతంలోని ప్రధాన పోర్టులు, టెర్మినల్స్ అన్నీ అదానీ గ్రూప్ చేతుల్లోకి పోతున్నాయి. ఇప్పటికే ఈ గ్రూప్ కింద 13 పోర్టులు ఉండగా.. తాజాగా ఒడిశాలోని గోపాల్పూర్ పోర్టును రూ. 3,080 కోట్లతో (95 శాతం వాటా) అదానీ గ్రూప్ కొనుగోలు చేసింది. దీంతో అదానీ గ్రూప్ కింద నడిచే పోర్టుల సంఖ్య 14కు చేరింది.
2001లో గుజరాత్లోని ముంద్రా పోర్టును మాత్రమే నిర్వహించే అదానీ గ్రూప్.. గడిచిన పదేండ్ల వ్యవధిలోనే ఏకంగా ఏడు పోర్టులను చేజిక్కించుకొన్నది. అంతేకాదు, దేశీయంగా జరిగే మొత్తం కార్గో వ్యాపారంలో 24 శాతం వాటా అదానీ గ్రూప్దే. కృష్ణపట్నం, కట్టుపల్లి, తునా, దహేజ్, హజీరా, దిఘీ, మోర్ముగావో, ఎన్నూర్, వైజాగ్ టెర్మినల్, ముంద్రా, కరైకల్, గంగవరం, దామ్రా, గోపాల్పూర్ పోర్టులు అదానీ గ్రూప్ కిందే నడుస్తున్నాయి.