హైదరాబాద్ : ఒడిశాలో భారతీయ జనతా పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి గిరిధర్ గమాంగ్ బీజేపీకి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు గిరిధర్ పంపారు. మాజీ సీఎం గిరిధర్ గమాంగ్ త్వరలోనే భారత రాష్ట్ర సమితిలో చేరనున్నారు.
గిరిధర్ గమాంగ్ 2015లో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి భారతీయ జనతా పార్టీలో చేరారు. ఇక ఇప్పుడు బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు గిరిధర్ గమాంగ్ ప్రకటించారు. ఆయన కుమారుడు శిశిర్ గమాంగ్ కూడా బీజేపీకి రాజీనామా చేశారు. త్వరలోనే వీరిద్దరూ బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు. ఇటీవలే ముఖ్యమంత్రి కేసీఆర్ను గిరిధర్ గమాంగ్ తన కుమారుడితో కేసీఆర్ను కలిసిన సంగతి తెలిసిందే.
ఒడిశా రాజకీయాల్లోనే కాదు, దేశ రాజకీయాల్లోనూ గిరిధర్ గమాంగ్కు ప్రత్యేకత ఉన్నది. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న గమాంగ్ సొంతరాష్ట్రం నుంచి 9 పర్యాయాలు పార్లమెంట్కు ఎన్నికయ్యారు. 1972 నుంచి 2004 దాకా వరుసగా కోరాపుట్, లక్ష్మీపూర్ స్థానాల నుంచి లోక్సభకు ఎన్నికయ్యారు. 1999 ఫిబ్రవరి 17 నుంచి డిసెంబర్ 6 వరకు సుమారు 10 నెలలపాటు ఒడిశా ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత కాంగ్రెస్ అధిష్ఠానం వ్యవహారశైలి నచ్చక 2015లో ఆయన బీజేపీలో చేరారు. కాగా, గిరిధర్ సతీమణి హేమ గమాంగ్ 1999లో ఎంపీగా వ్యవహరించారు.