భువనేశ్వర్: తాను ఆరోగ్యంగానే ఉన్నానని ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ (Naveen Patnaik) తెలిపారు. అందుకే ఇంత తీవ్ర ఎండలో కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నానని చెప్పారు. తన ఆరోగ్యం గురించి ప్రధాని మోదీ చేసిన ఆరోపణలను ఆయన ఖండించారు. ‘నేను మంచి స్నేహితుడినని బహిరంగంగా మోదీ చెప్పారు. ఆయన ఫోన్ చేసి నా ఆరోగ్యం గురించి అడిగి ఉంటే బాగుండేది. గత పదేళ్లుగా నా ఆరోగ్యంపై బీజేపీ పుకార్లు పుట్టిస్తోంది’ అని విమర్శించారు. తాను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నానని, గత నెల రోజులుగా రాష్ట్రంలో ప్రచారం చేస్తున్నానని, ఈ విషయంలో ప్రధానికి హామీ ఇస్తున్నానని ఎద్దేవా చేశారు. నా ఆరోగ్యం బాగా లేకపోతే ఈ ఎండ వేడిమి మధ్య నేను ప్రచారం చేయలేనని అన్నారు.
కాగా, ఒడిశాలోని మయూర్భంజ్, బాలాసోర్ ఎన్నికల సభల్లో ప్రధాని మోదీ ప్రసంగించారు. ఈ సందర్భంగా 77 ఏళ్ల సీఎం నవీన్ పట్నాయక్ ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఇది మిస్టరీ అని అన్నారు. ఆయన ఆరోగ్యం క్షీణించడానికి గల కారణాలను తెలుసుకోవడానికి తమ ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేస్తుందని మోదీ తెలిపారు. ‘దీని వెనుక కుట్ర ఉందా? ప్రస్తుతం ఆయన తరపున ప్రభుత్వాన్ని నడుపుతున్న లాబీ దీనికి కారణమా?’ అంటూ పలు అనుమానాలు వ్యక్తం చేశారు.