చెన్నై, జూలై 11: తమిళనాడులోని ప్రధాన ప్రతిపక్షం అన్నాడీఎంకేలో నాయకత్వ పోరుపై గత కొంతకాలంగా కొనసాగుతున్న ప్రతిష్టంభనకు ఎట్టకేలకు తెరపడింది. తమిళనాడు దివంగత సీఎం, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత నమ్మినబంటు, మాజీ సీఎం ఓ పన్నీర్సెల్వం (ఓపీఎస్)పై మాజీ సీఎం ఎడప్పాడి పళనిస్వామి (ఈపీఎస్) చర్యలు తీసుకున్నారు. ఆయన్ని కోశాధికారి పదవితో పాటు పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి తొలగించారు. ఓపీఎస్తో పాటు ఆయనకు మద్దతిస్తున్న ఇద్దరు ఎమ్మెల్యేలు వైతిలింగం, పీహెచ్ మనోజ్ పాండియన్తోపాటు మాజీ ఎమ్మెల్యే జేసీడీ ప్రభాకర్ను కూడా పార్టీ నుంచి తొలగించారు. ఈ మేరకు సోమవారం జరిగిన పార్టీ సర్వసభ్య సమావేశంలో నిర్ణయించారు. దీనికి ముందు పార్టీ తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా ఈపీఎస్ నియమితులయ్యారు. దీంతో అన్నాడీఎంకే పగ్గాలు ఈపీఎస్ చేతికి వచ్చాయి.
అందుకే ఓపీఎస్పై వేటేశాం
సర్వసభ్య సమావేశంలో ఆమోదించిన 16 తీర్మానాల్లో ఓపీఎస్, అతడి మద్దతుదారులను పార్టీ నుంచి బహిష్కరించే ప్రత్యేక తీర్మానం కూడా ఉన్నది. దీనికి పార్టీ జనరల్ కౌన్సిల్ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపినట్టు అన్నాడీఎంకే ఒక ప్రకటనలో వెల్లడించింది. అన్నాడీఎంకేలో కోశాధికారిగా, సమన్వయకర్తగా ఉంటూ.. అధికార డీఎంకేకు ఓపీఎస్ మద్దతిస్తున్నారని, స్టాలిన్ పార్టీ నేతలతో సంబంధాలు పెంచుకొని.. పార్టీని బలహీనపరుస్తున్నారని తీర్మానంలో ఆరోపించారు. పార్టీ ప్రయోజనాలకు వ్యతిరేకంగా ప్రవర్తించినందుకు ఓపీఎస్పై వేటు వేసినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. కాగా, పార్టీ నుంచి తనను తొలగించడంపై ఓపీఎస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను 1.5 కోట్ల మంది పార్టీ కార్యకర్తలచే అన్నాడీఎంకే సమన్వయకర్తగా ఎన్నికయ్యానని తెలిపారు. ఈ అంశంపై కోర్టుకు వెళ్లనున్నట్టు పేర్కొన్నారు. సర్వసభ్య సమావేశాన్ని వ్యతిరేకిస్తూ అన్నాడీఎంకే పార్టీ కార్యాలయం ఎదుట ఓపీఎస్ మద్దతుదారులు ఆందోళన చేశారు.