న్యూఢిల్లీ: హిమాలయాల్లోని (Himalayas) నందా దేవి కొండల్లో (Nanda Devi Hills) ప్రచ్ఛన్న యుద్ధ కాలం నాటి న్యూక్లియర్ డివైస్ (Nuclear Device) కూరుకుపోయింది. చైనాపై (China)గూఢచర్యం కోసం 1965లో సీఐఏ రహస్యంగా ఓ మిషన్ను నిర్వహించింది. దీనిలో భాగంగా ప్లుటోనియం పవర్డ్ జనరేటర్ను అమెరికన్, ఇండియన్ పర్వతారోహకులు తీసుకెళ్లారు. అది ప్రమాదవశాత్తూ ఇక్కడ పడిపోయింది. దీని ప్రభావం పర్యావరణంపై పడుతుందనే ఆందోళన దశాబ్దాల నుంచి వ్యక్తమవుతున్నది. జపాన్లోని నాగసాకిపై వేసిన అణు బాంబులో ఉన్న పీయూ-239 ఐసోటోప్, అత్యధిక రేడియోధార్మిక ఇంధనం పీయూ-238 ఈ డివైస్లో ఉండటంతో ఆందోళన వ్యక్తమవుతున్నది.
అయితే, దీనిని ఇక్కడ పోగొట్టుకున్న విషయాన్ని అంగీకరించడానికి అమెరికా ఇప్పటికీ తిరస్కరిస్తున్నది. ఈ మిషన్ను నిర్వహించిన వారిని విస్తృత స్థాయిలో ఇంటర్వ్యూలు చేసినపుడు, అమెరికా, భారత్ ప్రభుత్వాల వద్ద ఉన్న రహస్య పత్రాలను పరిశీలించినపుడు, ఈ డివైస్ గురించి బయటపడింది. ఈ డివైస్పై సమాధానం చెప్పాలని భారతీయులు 1970వ దశకం నుంచి ఇప్పటికీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఈ న్యూక్లియర్ డివైస్ మంచు ప్రవాహంలో కొట్టుకొస్తే, రేడియో ధార్మిక పదార్థం గంగా నదిలో కలిస్తే, కోట్లాది మందికి క్యాన్సర్ ముప్పు తప్పదని హిమాలయాల సమీపంలోని గ్రామస్థులు, పర్యావరణవేత్తలు, రాజకీయ నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్లుటోనియం అత్యంత విషపూరిత పదార్థం. ఇది నీటిలో కలిస్తే క్యాన్సర్కు కారణమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.