న్యూఢిల్లీ, మే 27: దేశంలో ప్రవేశపెట్టిన చీతాలు మృత్యువాతపడుతున్న నేపథ్యంలో నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ(ఎన్టీసీఏ) కీలక నిర్ణయం తీసుకున్నది. 11 మంది సభ్యులతో ఉన్నతస్థాయి చీతా ప్రాజెక్టు స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి గ్లోబల్ టైగర్ ఫోరమ్ సెక్రటరీ జనరల్ రాజేశ్ గోపాల్ చైర్మన్గా వ్యవహరించనున్నారు.
దేశంలో చీతాల ప్రాజెక్టు సమీక్ష, పురోగతి, పర్యవేక్షణ కోసం ఈ కమిటీ సలహాలు ఇవ్వనున్నది. చీతాలు ఉన్న ప్రాంతంలో ఎకో టూరిజం అభివృద్ధి, ఇందుకు అమలు చేయాల్సిన నిబంధనలపైనా సూచనలు చేయనున్నారు. ఇందుకు గానూ అంతర్జాతీయ చీతాల నిపుణులతోనూ ఈ కమిటీ సంప్రదింపులు చేపట్టనున్నది. విదేశాల నుంచి తీసుకొచ్చిన చీతాల్లో ఇప్పటికే మూడు మరణించాయి.