NEET UG 2026 : దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష నిర్వహణ విషయంలో ఉత్కంఠ కొనసాగుతోంది. గత నెలలో జరిగిన పరీక్ష పేపర్ లీకవడం, దీనిపై విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి తీవ్ర ఆందోళన వ్యక్తం కావడం, రాజకీయంగా విమర్శలు, కొందరు విద్యార్థుల ఆత్మహత్యల నేపథ్యంలో నీట్ రీ ఎగ్జామ్కు ప్రాధాన్యం ఏర్పడింది. ఈసారి పేపర్ లీక్ కాకుండా పరీక్ష నిర్వహణా సంస్థ అయిన ఎన్టీయే (నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ) తగిన జాగ్రత్తలు తీసుకుంటోంది. భారత సైనిక విభాగం కూడా పరీక్ష నిర్వహణలో పాలుపంచుకుంటుండటం విశేషం. ఆదివారం, జూన్ 21న దేశవ్యాప్తంగా నీట్ యూజీ రీ ఎగ్జామ్ జరగనుంది.
ఈ నేపథ్యంలో పరీక్షకు ఒక రోజు ముందు.. అంటే శనివారం దేశవ్యాప్తంగా మాక్డ్రిల్ నిర్వహించేందుకు సిద్ధమైంది ఎన్టీయే. పరీక్ష ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా మాక్ డ్రిల్ నిర్వహించనుంది. శనివారం ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం వరకు పరీక్షా కేంద్రాల వద్ద మాక్డ్రిల్ కొనసాగనుంది. పరీక్ష కోసం సంసిద్ధత, సమన్వయం, భద్రతా చర్యలు, పరీక్ష జరిగే విధానం వంటి అంశాలపై మాక్డ్రిల్ ఉంటుంది. దేశవ్యాప్తంగా 5,000కుపైగా పరీక్షా కేంద్రాల్లో నిర్వహించనున్న మాక్డ్రిల్లో 2.5 లక్షల మంది భద్రతా సిబ్బంది పాల్గొనబోతున్నారు. ఇప్పటికే పరీక్షా పత్రాలు, బుక్లెట్స్ అన్నింటినీ కేంద్ర పారామిలిటరీ బలగాలతో వివిధ విభాగాల భద్రతా సిబ్బంది ఆధీనంలో ఉంచారు. పరీక్ష సమయంలో మూడంచెల భద్రత ఉంటుంది. సీసీటీవీ కెమెరాలు, లక్షల మంది భద్రతా సిబ్బంది మధ్య నీట్ పరీక్ష జరగనుంది.
పరీక్షకు సంబంధించి అభ్యర్థులకు ఇప్పటికే హాల్ టిక్కెట్లు అందగా, ఇప్పుడు వాట్సాప్ ద్వారా కూడా తగిన సూచనలతో సమాచారం అందిస్తోంది ఎన్టీయే. పరీక్షల సందర్భంగా దేశవ్యాప్తంగా అన్ని మెడికల్ కాలేజీలు, వైద్య విద్యా సంస్థల వద్ద హై అలర్ట్ ప్రకటించారు. పారదర్శకంగా పరీక్ష నిర్వహించాలని ప్రయత్నిస్తున్నారు. దీనిలో భాగంగా టెలిగ్రామ్ యాప్ను కేంద్రం ఇప్పటికే నిషేధించిన సంగతి తెలిసిందే. మరోవైపు.. నీట్ పేపర్ లీకైందంటూ జరుగుతున్న ప్రచారాన్ని నమ్మవద్దని ఎన్టీయే సూచించింది.